జనవరి మాసం.. ఉప ఎన్నికల సమయం.!?

తెలంగాణలో బీజేపీ జనవరిలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు తీసుకు రావాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం ఖాయమయింది. అదే సమయంలో బీజేపీ కాస్త బలంగా ఉందనుకున్న మరో రెండు…

తెలంగాణలో బీజేపీ జనవరిలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు తీసుకు రావాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం ఖాయమయింది. అదే సమయంలో బీజేపీ కాస్త బలంగా ఉందనుకున్న మరో రెండు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. 

రాజీనామా చేసి వస్తే బంగారు భవిష్యత్ చూపిస్తామని హామీ ఇస్తున్నారని, వీరు ఇరువురు కూడా వస్తే.. మొత్తం మూడు స్థానాలకు ఉపఎన్నికలు పెట్టి.. గెలిచేసి.. గాలి మొత్తం తమ వైపే ఉందని నిరూపించాలని అనుకుంటున్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ పక్కా ప్రణాళికతో రాజకీయ అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితి అనిశ్చితంగా ఉంది. టీఆర్ఎస్ సర్కార్‌పై వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కానీ పలు సర్వేల్లో ఆ పార్టీకి మెరుగైన స్థానం లభిస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్‌కు కానీ ఉపయోగపడుతోందని ఎవరూ చెప్పడం లేదు. 

ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. గాలి తమ వైపే ఉందని నిరూపించడానికి బీజేపీ ఇప్పుడు ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఉపఎన్నికల్లో గెలవడం ద్వారా వచ్చే ఊపుతో అసెంబ్లీ ఎన్నికల్లో ఊడ్చేయవచ్చని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే జోష్ ఎలాంటిదో రాజకీయాల్లో ఉండేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ప్రజల మద్దతు మొత్తం తమ పార్టీ వైపే ఉంటుందని అనుకుంటారు. ఉపఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. అధికార పార్టీ ఓడిపోతే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లే లెక్క. ఈ ప్రకారం తెలంగాణలో ప్రభుత్వంపై వ్యతిరేకతను బీజేపీ బట్టబయలు చేయాలని ఆ వ్యతిరేకత తమకే లాభిస్తుందని నిరూపించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.