రాజకీయమైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ఒక విధానం అంటూ వుండాలి. అది లేకపోతే రాజకీయమైనా, వ్యక్తిగత జీవితమైనా నాశనమవుతుంది. రాజకీయాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఒక కొత్త విధానాన్ని జనసేన పవన్కల్యాణ్ ప్రవేశ పెట్టారు.
భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరొకరితో సహజీవనం చేయవచ్చు. అలాగే పిల్లల్ని కనొచ్చు. రాజకీయ విషయానికి వస్తే… మిత్రపక్షంతో విడిపోకుండానే మరొక పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. సీట్లు పంపిణీ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిత్రపక్షంతో సమన్వయం చేసుకోడానికి ఒక నాయకుడికి బాధ్యతలు అప్పగించొచ్చు. పవన్ తాజా రాజకీయ పంథాపై బీజేపీ నేతలు రగిలిపోతున్నారు.
పవన్ తీరు ఎలా వుందంటే… భార్యకు విడాకులు ఇవ్వకుండా మరొకరిని పెళ్లాడి, ఆ తర్వాత విడాకుల కోసం లాయర్ నోటీసులు పంపించినట్టు ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీతో పొత్తు వుంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత తన పార్టీ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ ప్రసంగిస్తూ ….మిత్రపక్షాలతో సమన్వయ బాధ్యతలు నాదెండ్ల మనోహర్కు అప్పగిస్తున్నామన్నారు. బీజేపీ, టీడీపీ నాయకులతో ఆయనే సమన్వయం చేసుకుంటారని చెప్పారు.
టీడీపీతో పొత్తు వుంటుందని పవన్ ప్రకటించిన తర్వాత, ఇక తమతో సమన్వయం చేసుకునేది ఏముంటుందని ఏపీలో నిజమైన బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మిత్రపక్ష పార్టీతో కనీసం చర్చించకుండా టీడీపీతో పొత్తును ఎలా ప్రకటిస్తారనే ప్రశ్న వారి నుంచి వస్తోంది. పొత్తుకు దారి తీసిన పరిస్థితులను అమిత్షా, నడ్డాకు చెప్పడం తన కనీస బాధ్యతగా పవన్కల్యాణ్ చెప్పడం విడ్డూరంగా వుందని అంటున్నారు.
రాజకీయాలంటే పవన్కు పిల్లాటలు అయ్యాయని, గత ఎన్నికల్లో దెబ్బతిన్నా ఆయనకు జ్ఞానోదయం కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బీజేపీతో నాదెండ్ల మనోహర్ సమన్వయం ఎలా చేసుకుంటారో చూడాలి.