ఏదో ఒక సందర్భాన్ని సృష్టించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విమర్శించడమే లక్ష్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ పెట్టుకున్నారు. తాజాగా గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా గిడుగుకు నివాళులర్పిస్తూనే, మరోవైపు వైఎస్ జగన్పై తన మార్క్ విమర్శల్ని పవన్కల్యాణ్ గుప్పించడం గమనార్హం.
ఇదిలా వుండగా మాతృభాష తెలుగును జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారంటూ పవన్ విమర్శించడంపై వైసీపీ శ్రేణులు ఘాటుగా స్పందిస్తున్నాయి. మీ పిల్లలకు తెలుగు నేర్పిస్తుంటే జగన్ వద్దన్నారా? మరెందుకని మీరు నేర్పించలేదంటూ నిలదీయడం విశేషం. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పవన్ విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే….
“మాట్లాడే భాష.. రాసే భాష ఒకటి కావాలని తపించి ఆ దిశగా వ్యావహారిక భాషోద్యమాన్ని నడిపిన గిడుగు వెంకట రామమూర్తిని తెలుగు జాతి ఎన్నడూ మరవకూడదు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల భాషలోకి తీసుకొచ్చి మన మాతృభాషకు జీవం పోశారు. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామమూర్తికి సభక్తికంగా అంజలి ఘటిస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదు. కాబట్టి ప్రజలే తెలుగు భాషను కాపాడుకునే బాధ్యతను స్వీకరించాలి. తెలుగు భాషాభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ విభాగాల పనితీరును గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వారు విడుదల చేసే ప్రకటనల్లోనూ, విద్యాశాఖ నుంచి వచ్చే ప్రకటనల్లో ఎన్ని అక్షర దోషాలు వుంటున్నాయో చూస్తేనే తెలుస్తోంది. అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేం. చిన్నారులు ఓనమాలు నేర్చుకునే దశ నుంచే మన మాతృభాషను దూరం చేసే విధంగా ఉన్న పాలకుల తీరు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి”
గిడుగు జయంతిని సాకుగా తీసుకుని జగన్ ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజలే తెలుగు భాషను కాపాడుకునే బాధ్యతను తీసుకోవాలని చెబుతున్న పెద్ద మనిషి, కేవలం మాటలేనా…చేతలేమైనా ఉన్నాయా? అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ముందు తన ఇంటి నుంచే మాతృభాషను కాపాడుకునే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని హితవు చెబుతున్నారు.
తన పిల్లల్ని మాత్రం దేశ విదేశాల్లో చదివిస్తూ, పేదల పిల్లలకు ఇంగ్లీష్ విద్య వద్దని చెప్పే హక్కు పవన్కు ఎక్కడిదని నిలదీస్తున్నారు.