బుచ్చ‌య్య చౌద‌రికి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ షాక్‌!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రికి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ‌ట్టి షాక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆ జిల్లాలోని ఆశావ‌హులు,…

టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రికి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ‌ట్టి షాక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆ జిల్లాలోని ఆశావ‌హులు, జ‌న‌సేన నేత‌ల‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మావేశ‌మ‌య్యారు.

రాజ‌మండ్రి లోక్‌స‌భ ప‌రిధిలో రాజాన‌గ‌రం, రాజ‌మండ్రి రూర‌ల్ స్థానాల్లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. రాజ‌మండ్రి రూర‌ల్ అభ్య‌ర్థిగా కందుల దుర్గేష్ పేరును ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించి టీడీపీకి షాక్ ఇచ్చారు. రాజాన‌గ‌రం అభ్య‌ర్థిపై ఇంకా ప‌వ‌న్ క్లారిటీ ఇవ్వ‌లేదు.  ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా జ‌న‌సేన అధ్య‌క్షుడిగా కందుల దుర్గేష్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

రాజ‌మండ్రి రూర‌ల్ టికెట్ త‌న‌కే అని చాలా కాలంగా ఆయ‌న ప్ర‌చారం చేసుకుంటున్నారు. అయితే త‌న‌ను కాద‌ని జ‌న‌సేన‌కు రాజ‌మండ్రి రూర‌ల్ టికెట్ ఇచ్చే ప్ర‌శ్నే లేద‌ని సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి చెబుతూ వ‌స్తున్నారు. అస‌లు రాజ‌మండ్రి రూర‌ల్ టికెట్ ప్ర‌క‌టించడానికి కందుల దుర్గేష్ ఎవ‌రని ఒకింత ఆవేశంతో కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. సిటింగ్ ఎమ్మెల్యేల‌కే తిరిగి అవే స్థానాలు ఇస్తామ‌ని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌కటించడాన్ని గోరంట్ల ప‌దేప‌దే గుర్తు చేస్తున్నారు.

ఒక‌వేళ త‌న‌కు కాద‌ని జ‌న‌సేన‌కు టికెట్ ఇస్తే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంట‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రోవైపు కందుల దుర్గేష్‌కు అధికారికంగా టికెట్ ప్ర‌క‌టించ‌డంతో జ‌న‌సేన శ్రేణులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నాయి.