యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టారు. పాద యాత్రలో లోకేశ్ సంబంధిత నియోజక వర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో నిజానిజాలేంటో లోకేశ్కు వైసీపీ ప్రజాప్రతినిధులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తమదైన రీతిలో లోకేశ్కు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా డాక్టర్ సుధీర్రెడ్డి కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే తనపై లోకేశ్ చేసిన ఆరోపణలపై సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి ఇచ్చిన కౌంటర్ పేలవంగా వుంది. లోకేశ్ ఆరోపణలపై ఏ ఒక్క దానికి జగన్ మేనమామ సమాధానం ఇవ్వకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. అంటే రవీంద్రనాథ్రెడ్డి భూబకాసురుడని లోకేశ్ ఆరోపణలన్నీ నిజమా? అనే అనుమానం తలెత్తుతోంది. పాదయాత్రలో కమలాపురం ఎమ్మెల్యేపై లోకేశ్ ఆరోపణలు ఆయన మాటల్లోనే…
“సీఎం మేనమామ నియోజకవర్గంలో అబివృద్ధి నిల్.. అహంకారం, అవినీతి, కబ్జాలు ఫుల్. కమలాపురం ఎమ్మెల్యేకు భూ కబ్జా అంటే వ్యసనం. అందుకే ఆయనకు ఓ పేరు పెడుతున్నా. రవీంద్రనాథరెడ్డి కాదు.. భూబకాసురుడు. కడప శివారులో రూ.200 కోట్లు విలువ చేసే 54 ఎకరాలను కొట్టేశాడు. సర్వరాయసాగర్ సమీంలో 400 ఎకరాలు భూమిని ఆక్రమించి చేపల చెరువులు, పండ్లతోటలు వేశాడు. లేపాక్షిలో భూములు లేపడానికి స్కెచ్ వేసి రూ.20 వేల కోట్ల విలువైన 9 వేల ఎకరాల భూమిని రూ.500 కోట్లతో నొక్కడానికి ప్లాన్ వేశాడు. టీడీపీ అడ్డుకోవడంతో సైలెంట్ అయ్యాడు”
తనపై దారుణ ఆరోపణలు చేసినా రవీంద్రనాథ్రెడ్డి వాటిని ఖండించకపోవడం గమనార్హం. రవీంద్రనాథ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చీకట్లో తిరిగితే ఏ సమస్యలు తెలుస్తాయని ప్రశ్నించారు. వాళ్ల నాన్నలాగే ఈవెనింగ్ వాక్ చేస్తున్నాడని విమర్శించారు.
వైఎస్సార్, ఆయన తనయుడు జగన్ మండుటెండలో పాదయాత్ర చేస్తే, లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు ఈవెనింగ్ వాక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్ ఆరోపణలేంటి? జగన్ మేనమామ వివరణ ఏంటి? అసలు పొంతన ఏమైనా వుందా? ఇదేనా కౌంటర్ ఇవ్వడం అంటే? లోకేశ్ ఆరోపణలు నిజమే అనిపించేలా రవీంద్రనాథ్రెడ్డి స్పందన వుందనే ప్రచారం జరుగుతోంది.