వేట‌కు సిద్ధంగా జ‌గ‌న్‌!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఒక అభ్య‌ర్థి గెలుపుతో ఊపు మీద ఉన్న టీడీపీపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుప‌డ్డారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ సింహం ఒక్క అడుగు వెన‌క్కి వేస్తే ఓడిన‌ట్టు…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఒక అభ్య‌ర్థి గెలుపుతో ఊపు మీద ఉన్న టీడీపీపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుప‌డ్డారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ సింహం ఒక్క అడుగు వెన‌క్కి వేస్తే ఓడిన‌ట్టు కాద‌న్నారు. రెట్టింపు బ‌లంతో వేట‌డ్డానికి సిద్ధంగా జ‌గ‌న్ ఉన్నార‌ని ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల్లో గెలుస్తామ‌ని, ఆ సీటు త‌మ‌దే అని టీడీపీ నేత‌లు అంటున్నార‌ని రోజా గుర్తు చేశారు.

పులివెందుల సీటు కాదు క‌దా, అక్క‌డి చెక్‌పోస్టును కూడా ట‌చ్ చేసే ద‌మ్ము, ధైర్యం వున్న మ‌గాడు ఇంకా పుట్ట‌లేద‌ని రోజా ఆవేశంగా చెప్పుకొచ్చారు. రూ.కోట్లు పెట్టి నలుగురు ఎమ్మెల్యేలను చంద్ర‌బాబు కొనుగోలు చేశారని ఆరోపించారు. చంద్ర‌బాబు దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తూనే ఉన్నార‌న్నారు.  

ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలిచి చంద్ర‌బాబు నానా హంగామా చేస్తూ రెచ్చ‌గొడుతున్నార‌ని మండిప‌డ్డారు. గ‌తంలో అమ్ముడు పోయిన 23 మంది ఎమ్మెల్యేల గ‌తే నలుగురు ఎమ్మెల్యేల‌కు ప‌డుతుంద‌ని ఆమె హెచ్చ‌రించారు.

స‌స్పెన్ష‌న్‌కు ముందు, ఆ త‌ర్వాత న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకా ఎవ‌రిని మ‌భ్య‌పెట్టాల‌ని డ్రామాలాడుతున్నార‌ని ప్ర‌శ్నించారు. న‌లుగురు ఎమ్మెల్యేలు వైసీపీకే ఓటు వేశామంటూ డ్రామాలు ఆడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆ నాలుగు చోట్ల కొత్త వారిని నిల‌బెట్టి జ‌గ‌న్ గెలిపించుకుంటార‌ని రోజా అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నాయ‌కుల్ని నమ్ముకోలేద‌న్నారు. కొత్త నాయ‌కుల్ని త‌యారు చేస్తాన‌ని గ‌తంలో జ‌గ‌న్ చెప్పార‌ని రోజా గుర్తు చేశారు.