తిరుపతి జిల్లా నగరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో వైసీపీలో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. మంత్రి రోజాకు వ్యతిరేకంగా ప్రతి మండలంలో వైసీపీలో బలమైన గ్రూప్ తయారైనట్టు కొంత కాలంగా విస్తృతంగా ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. వీరికి వైసీపీలోనే బలమైన నాయకుడి అండదండలున్నాయనేది బహిరంగ రహస్యమే. ఈ దఫా ఎలాగైనా రోజాను ఓడించాలని టీడీపీ కంటే వైసీపీలోని ఆమె వ్యతిరేక వర్గీయులే పంతం పట్టారు.
రోజా వ్యతిరేక వర్గాన్ని బలోపేతం చేసేందుకు అధికారం బాగా ఉపయోగపడడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ నేపథ్యంలో నగరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి రోజాతో ఆమెకు వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతిని కలపాలని సీఎం ప్రయత్నించారు. రోజాతో చేయి కలిపేందుకు శాంతి ససేమిరా అనడం వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.
స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలుగజేసుకుని ఇద్దరు మహిళా నేతల చేతుల్ని కలిపేందుకు ప్రయత్నించారు. అతికష్టం మీద శాంతి చేతిని ముందుకు చాచారు. సీఎం వైఎస్ జగన్ గ్రహించాల్సిన విషయం ఒకటి వుంది. జగన్ కలపాల్సింది చేతుల్ని కాదు… వారి మనసుల్ని. మనసుల్లో ఒకరిపై మరొకరు ద్వేషాన్ని నింపుకుని వుంటే, కేవలం చేతుల్ని కలిపినంత మాత్రాన ప్రయోజనం ఏంటనే కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ఒకవైపు రోజాకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఆమె నియోజకవర్గంలోని నాయకులకు ఎడాపెడా పదవులు కట్టబెట్టారు. అలాగే ఆర్థికంగా ప్రయోజనం కలిగించేందుకు మైన్స్కు అనుమతులు ఇచ్చారు. అలాంటప్పుడు రోజాను వారెందుకు ఖాతరు చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై, ఆయన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శిస్తే, మొట్టమొదట స్పందించే మంత్రి ఎవరంటే… రోజా పేరు వినిపిస్తుంది. అలాంటి నాయకురాలిని నగరిలో ముప్పుతిప్పలు పెడుతుంటే, చేతుల్ని కలిపి, చేతులు దులుపుకుందామని ఎలా అనుకున్నావ్ జగన్ అనే నిలదీత ఎదురవుతోంది. ఇప్పటికైనా నగరిలో ఏం జరుగుతున్నదో వాస్తవాలు తెలుసుకుని, దిద్దుబాటు చర్యలు చేపడితే వైసీపీకే మంచిది.