మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ ఎదురు దాడి సాగుతోంది. తాజాగా చిరంజీవిపై మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిరుకు రోజా మాస్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా రంగంపై పడతారేంటని, ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలని వైసీపీకి చిరంజీవి హితవు చెప్పడం రాజకీయ దుమారం రేపింది.
ఈ నేపథ్యంలో రోజా మీడియాతో మాట్లాడుతూ ఏ అర్హత వుందని సినిమా టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని అడుక్కున్నారని ప్రశ్నించారు. హీరోలందరూ కలిసి సీఎం వైఎస్ జగన్ దగ్గరికి ఎందుకెళ్లారని రోజా నిలదీశారు. చిరంజీవి, పవన్కల్యాణ్ మినహాయిస్తే ఏ హీరోలు ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని రోజా చెప్పుకొచ్చారు. సినిమా వేదికలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించడం గమనార్హం.
రాజకీయాలే చేయాలని అనుకుంటే ఆ రంగంలో వుండి చేయాలని ఆమె సవాల్ విసిరారు. అలాగే సినిమాలు చేయాలని అనుకుంటే రాజకీయాల జోలికి రాకుండా వాటినే చేసుకోవాలని రోజా హితవు చెప్పారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేశారన్నారు. చిరంజీవి చెబితే విని పనిచేసే పరిస్థితిలో జగన్ లేరని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని విడగొడుతుంటే కేంద్ర మంత్రిగా చిరంజీవి ఏం చేశారని రోజా ప్రశ్నించారు.
ప్రజల తిరస్కారానికి గురై పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేశారని ఆమె విమర్శించారు. తమ్ముడికి బలాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే చిరంజీవి తమ ప్రభుత్వంపై విమర్శలు చేశాడన్నారు. సన్యాసి, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్టుగా, అన్నదమ్ములిద్దరూ కలిస్తే అదే జరుగుతుందని రోజా వెటకరించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చిరంజీవి రాజకీయ విమ్శలు చేయడం వ్యూహాత్మకమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పవన్కల్యాణ్ కోసం తన అభిమానుల్ని యాక్టీవ్ చేసేందుకే చిరంజీవి వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.