రాజకీయ కుట్ర చేయడంలో తన మరిది చంద్రబాబునాయుడిని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మించిపోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను నాయకత్వ వహిస్తున్న పార్టీని బలోపేతం చేయడం మాని, మరిది నాయకత్వం వహిస్తున్న టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పురందేశ్వరి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు బీజేపీలో కలుగుతున్నాయి.
ఇందుకు ఉదాహరణగా ఇవాళ రామోజీరావు పత్రిక ఈనాడులో పురందేశ్వరి ఇంటర్వ్యూ రావడమే అనే చర్చ బీజేపీలో సాగుతోంది. ఎలాగైనా బీజేపీకి వైసీపీని దూరం చేయాలని, అందుకు పురందేశ్వరే సరైన లీడర్ అని రామోజీరావు సామాజిక వర్గం భావిస్తోంది. సామాజిక వర్గం రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీని కూడా బలిపెట్టేందుకు పురందేశ్వరి వెనుకాడడం లేదనే అనుమానాలు బీజేపీ నేతల్లో కలుగుతున్నాయి.
మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానంపై మూడు రోజుల చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. రెండో రోజైన బుధవారం వైసీపీ మాట్లాడుతుందని తెలిసి, ఆ పార్టీని రెచ్చగొట్టేలా పురందేశ్వరి ఇంటర్వ్యూను ఈనాడు పత్రిక ప్రచురించిందనే ప్రచారం జరుగుతోంది.
“కేంద్రానికి ఎందుకు మద్దతిస్తోందో వైకాపానే అడగాలి” అనే తాటికాయంత అక్షరాలతో ఈనాడులో పురందేశ్వరి ఇంటర్వ్యూ ప్రచురితమైంది. ఫ్లోర్ మేనేజ్మెంట్లో భాగంగా వైసీపీ ఎందుకు అవిశ్వాస తీర్మానం, ఇతర విషయాల్లో మద్దతిస్తోందో తమను కాదు, ఆ పార్టీనే అడగాలని పురందేశ్వరి చెప్పారు. ఇదే విషయమై ఆమె టీడీపీని ఎందుకు విమర్శించడం లేదు. టీడీపీ ఏమీ బీజేపీ మిత్రపక్షం కాదు కదా? కేవలం వైసీపీని టార్గెట్ చేయడం వెనుక టీడీపీకి రాజకీయ, సామాజిక ప్రయోజనాలు కలిగించడమే ఏకైక లక్ష్యంగా పురందేశ్వరి నడుచుకుంటున్నారనే అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. మరోవైపు తన కుమారుడిని టీడీపీలో చేర్పించేందుకు ఆమె ప్రయత్నాలు ఊపందుకున్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా వుండగా ఇవాళ అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా వైసీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి మాట్లాడుతూ ఈ అవిశ్వాసానికి విలువ లేదన్నారు. ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉందని, అవిశ్వాస తీర్మానం రెండు కూటముల మధ్య రాజకీయాలు చేసుకోవడానికి మాత్రమే అని అన్నారు. మోదీ సర్కార్పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని కుండబద్దలు కొట్టారు.
తాను రెచ్చగొట్టినా వైసీపీ రెచ్చిపోకుండా కేంద్రంలో తమ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు ఇచ్చిందని పురందేశ్వరి మనసులో తెగ బాధపడుతోంటోందని బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. పురందేశ్వరి కుట్రలు ఇప్పుడిప్పుడే బీజేపీ నేతలు పసిగడుతున్నారు. అయితే ఆమె ఏపీ బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా త్వరగానే ఆమె ఎవరి కోసం పని చేస్తున్నారో బయట పడడం ఒక్కటే సంతోషించదగ్గ విషయమని ఆ పార్టీ బీజేపీ నేతలు అంటున్నారు.