చంద్రబాబుకు అనారోగ్యమంటూ టీడీపీ చేస్తున్న ప్రచారంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సజ్జల ఇవాళ మీడియాతో మాట్లాడారు. జైలు ఏమైనా అత్తగారిల్లా అని ఆయన ప్రశ్నించారు. స్నేహ బ్యారెక్ మొత్తం ఖాళీ చేసి చంద్రబాబు కోసమే కేటాయించామన్నారు. చంద్రబాబుపై రోజుకో కొత్త డ్రామాకు టీడీపీ నేతలు తెరలేపుతున్నారని సజ్జల మండిపడ్డారు.
చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బాబు ఆరోగ్యం విషమించిందని, ప్రాణాలకు ప్రమాదం పొంచి వుందని ప్రచారాన్ని మొదలు పెట్టారని ఆయన తప్పు పట్టారు. ఈ ప్రచారం పరాకాష్టకు చేరిందని ఆయన దుయ్యబట్టారు. డీహైడ్రేషన్తో మొదలు పెట్టి ప్రాణాలకు ప్రమాదం అనే వరకూ వచ్చారని ఆయన అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారంటూ ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడేమో ప్రభుత్వం స్టెరాయిడ్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తోందని లోకేశ్ ట్వీట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకేశ్ తన ట్వీట్లో ఇన్ఫెక్షన్లు, దోమలు, స్కిన్ సమస్యలు వంటివి ప్రస్తావించారన్నారు. అయితే వీటిలో ప్రాణాంతకం ఏంటో అర్థం కావడం లేదన్నారు. జైలు ఏమైనా అత్తగారిల్లా? ఏసీలు కావాలని అడగడం విచిత్రంగా వుందని సజ్జల మండిపడ్డారు. ప్రపంచంలోనే ఏకైక హక్కు చంద్రబాబుకే ఉండాలనే విధంగా మాట్లాడ్డం విడ్డూరమన్నారు. చంద్రబాబు జైల్లో ఒక కిలో బరువు పెరిగారన్నారు. కానీ ఐదు కిలోల బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
బాబు బరువు తగ్గారంటే ఆయన భార్య భోజనంలో ఏం కలుపుతున్నారో? అని అనుమానం వ్యక్తం చేశారు. ఇంటి దగ్గరి నుంచి తెచ్చే భోజనంలో ఏమైనా కలిపి అనారోగ్యానికి గురయ్యేలా చేసే అవకాశం వుందని ఆయన సందేహపడ్డారు. అందుకే ఇంటి దగ్గరి నుంచి తెచ్చే భోజనాన్ని కూడా పరీక్షిస్తున్నారని సజ్జల తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని సజ్జల స్పష్టత ఇచ్చారు.