వైసీపీ తొలి విడత బస్సుయాత్రకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సభలో బస్సుయాత్ర గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ సామాజిక బస్సుయాత్ర షెడ్యూల్ను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విశాఖలో శుక్రవారం జరిగిన ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నేతల సమావేశంలో బస్సుయాత్రపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
ఇవాళ ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల తమ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఇచ్ఛాపురంలో ఈ నెల 26న బస్సుయాత్ర ప్రారంభమై 13 రోజుల పాటు సాగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
తొలి విడత బస్సు యాత్ర నవంబర్ 9న అనకాపల్లిలో ముగుస్తుంది. సామాజిక న్యాయ బస్సు యాత్ర పేరుతో ఈ బస్సు యాత్ర సాగుతుందని బొత్స తెలిపారు. ఈ యాత్రలో మరోసారి ఏపీకి జగన్ నాయకత్వం ఎందుకు అవసరమో వివరిస్తామన్నారు.
ఈ బస్సు యాత్ర ఇచ్ఛాపురం, గజపతినగరం, భీమిలి, పాడేరు, ఆముదాలవలస తదితర ప్రాంతాల మీదుగా సాగుతుందని మంత్రి తెలిపారు. తొలి విడతలో చివరిగా నవంబర్ 9న అనకాపల్లి చేరుకుంటుందని మంత్రి తెలిపారు.