జనసేనాని పవన్కల్యాణ్తో పాటు టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో విడివిడిగా వుంటే, తమను సీఎం వైఎస్ జగన్ రాజకీయంగా కొడ్తారనే భయంతోనే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.
చంద్రబాబు, పవన్కల్యాణ్, బీజేపీ కలిసినా వైఎస్ జగన్ను ఏమీ చేసుకోలేరన్నారు. జగన్ను రాజకీయంగా కొట్టడం ఎవరి తరం కాదని ఆయన తేల్చి చెప్పారు. ప్రత్యర్థులకు చేతకాకపోవడం వల్లే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లినట్టు లేదన్నారు. ప్రశాంతంగా అక్కడ కూచుని పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. విడివిడిగా వుంటే తామెక్కడ జైలుపాలు అవుతామో అనే భయం వాళ్లలో వుందన్నారు.
చంద్రబాబు దగ్గరికి లోకేశ్, బాలకృష్ణ, పవన్కల్యాణ్ కేవలం పొత్తుల కోసమే వెళ్లారని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఏపీలో ఏమీ చేయలేక ఢిల్లీకి చక్రం తిప్పడానికి లోకేశ్ వెళ్లారట అని ఆయన ఎద్దేవా చేశారు. భయమేస్తోందని ఎవరైనా చెబితే తన చుట్టూ పడుకోవాలన్నట్టుగా చంద్రబాబు కథ వుందని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ కొంప ముంచుతాయోమో అన్న భయం అన్ని పార్టీల్లోనూ వుందన్నారు. వాళ్లంతా ఒక్కటే అని ముందు నుంచి తెలుసన్నారు. ఇప్పుడు ముసుగులు తొలగించారని చెప్పుకొచ్చారు.
త్వరగా అందరూ కలవకపోతే వైఎస్ జగన్ ఒక్కొక్కరిని విడదీసి కొడ్తారనే భయం కనిపిస్తోందన్నారు. ప్రతిపక్షాలకు ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు.