నారా లోకేశ్ తమను పిలిచే తీరుపై టీడీపీ యువనేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. తన వయసుకు అటూఇటూ ఉన్న యువ నేతల్ని లోకేశ్… ఏరా, రేయ్ అంటూనే పేరు పెట్టి పిలవడంపై అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. మనసులోని ఆవేదనను ఎలా బయట పెట్టాలో తెలియని పరిస్థితిలో సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నారు.
ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖుడి కుమారుడు, అలాగే అత్యున్నత చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న యువ నాయకుడిని, విశాఖకు చెందిన మాజీ మంత్రి కుమారుడిని… ఇలా రాష్ట్ర వ్యాప్తంగా యువ నేతలందరినీ లోకేశ్ రేయ్ అని పిలుస్తుండడంపై పెద్ద ఎత్తున టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది.
రేయ్, ఏరా, పోరా అని పిలవడం వెనుక కలుపుగోలు తనం, ఆత్మీయత దాగి ఉన్నాయని లోకేశ్ చెబుతున్నట్టు సమాచారం. అయితే బాల్యం నుంచి స్నేహం ఉన్న వాళ్ల మధ్య అలాంటి పిలుపు ఉన్నా పట్టించుకోనవసరం లేదని, కేవలం లోకేశ్ ఒక్కరే పిలవడం, అటు వైపు నుంచి సార్, అన్నా అని పిలుస్తుండడాన్ని గుర్తు చేస్తున్నారు.
అవమానించాలనే ఉద్దేశంతో లోకేశ్ పిలుస్తుండకపోవచ్చని, కానీ పిలిపించుకునే వాళ్ల మానసిక స్థితిని కూడా ఆయన అర్థం చేసుకుని మెలిగితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు టీడీపీ యువనేతలు తమను లోకేశ్ రేయ్, ఏరా అని పిలవడాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి బాధపడినట్టు సమాచారం.
అయితే లోకేశ్కు యువనేతల బాధ గురించి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా లోకేశ్ ఎదుటి వాళ్ల మనోభావాలను గ్రహించి పిలిస్తే బాగుంటుంది. ఆప్యాయతకు రేయ్, ఏరా పిలుపులు ప్రామాణికం కాదని ఆయన గ్రహిస్తే మంచిదని యువ నేతలు హితవు చెబుతున్నారు. పేరుతో ప్రేమగా పిలిస్తే… అంతకంటే ఏం కావాలని యువనేతలు అంటున్నారు. లోకేశ్ అర్థమవుతోందా వారి వేదన!