ఉదయం ఊపు వారికి.. సాయంత్రం వీరికి ?

ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ సరళి మీద రాజకీయ పార్టీల అంతర్గత చర్చలు చేస్తూ ఉన్నారు. ఓటరు ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఎవరి వైపు మొగ్గు చూపారు అన్న దాని మీద వారు తర్కించుకుంటున్నారు.…

ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ సరళి మీద రాజకీయ పార్టీల అంతర్గత చర్చలు చేస్తూ ఉన్నారు. ఓటరు ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఎవరి వైపు మొగ్గు చూపారు అన్న దాని మీద వారు తర్కించుకుంటున్నారు. ఓటర్ల నాడిని పట్టే పనిలో ఉన్నారు. అంతే కాదు ఓటరు హోదా స్థాయి. వారి నేపధ్యం, వారు స్థితిగతులు బట్టి ఆ ఓట్లు ఏ వైపు వెళ్లాయో కూడా అంచనా కడుతున్నారు. విశాఖ జిల్లాలో ఉదయం అంతా జరిగిన పోలింగ్ టీడీపీ కూటమికి అనుకూలంగా ఉందని అంటున్నారు.

సాయంత్రం చేసి పడిన పోలింగ్ అంతా కూడా వైసీపీకి పూర్తి స్థాయిలో అనుకూలించింది అని అంటున్నారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా నిలిచి వేసిన ఓట్లు అన్నీ గంపగుత్తగా వైసీపీకే పడ్డాయని చెబుతున్నారు. వైట్ కాలర్స్, విద్యావంతులు అర్బన్ జనాలు మేధావులు అనబడే వారు అంతా కూడా ఉదయం ఓటింగ్ లో ఎక్కువగా కనిపించారు అని అంటున్నారు. ఇక ఆ తరువాత అసలైన జన జాతర మొదలై పోలింగ్ బూత్ లు అన్నీ భారీ క్యూలతో దర్శనం ఇచ్చాయని అవన్నీ కూడా వైసీపీ వాటానే అని అంటున్నారు.

ఈ విధంగా లెక్క వేసుకుంటూ తమకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని అటు వైసీపీ ఇటు టీడీపీ కూటమి రెండు శిబిరాలూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చూస్తే ఓటు డివిజన్ చాలా రకాలుగా సాగింది. ఇపుడు కొత్తగా అర్బన్ రూరల్ అంటూ కూడా డివిజన్ సాగింది.

అయితే ఎక్కడా లేని విధంగా విశాఖలో ఉదయం సాయంత్రం పోలింగ్ అంటూ సరికొత్త డివిజన్ ని తీసుకుని వచ్చారు అని అంటున్నారు దీంతో కాలాన్ని సమయాన్ని బట్టి ఓటు వేసే వారు తమ వైపు అని రాజకీయ పార్టీలు భావించడం కొత్త రకం విశ్లేషణగా ఉంది అని అంటున్నారు. ఎవరెన్ని చెప్పుకున్నా ఓటరు మదిలో మాట బయటకు అయితే రాలేదు. అందువల్ల ఈవీఎం మిషన్ అసలు నిజం చెప్పాల్సి ఉంది. అంతవరకూ ఎవరికి తోచిన తీరున వారు ప్రజా తీర్పుని అంచనా కడుతూ పోవడమే అని రాజకీయ పండితులు అంటున్నారు.