రెండు దఫాలుగా టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయాలని ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. ముందుగా దసరాకు మేనిఫెస్టో -1, ఆ తర్వాత ఎన్నికల నాటికి మరొకటి తెరపైకి తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు, కసరత్తు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టోపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. మేనిఫెస్టోలో ఎల్లో మీడియాకు ప్రత్యేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారని నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఇందులో తన రాజగురువు, ఈనాడు అధినేత రామోజీరావుకు సింహభాగం ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అని నెటిజన్లు వెటకరిస్తున్నారు.
ఇక ఈనాడు తోక పత్రిక, వీకెండ్స్ కాలమిస్ట్కు చెందిన పత్రిక, చానల్కు, అలాగే మరో నాయుడి గారి చానల్కు గతంలో మాదిరిగానే ప్రభుత్వ, పార్టీ ప్రసార హక్కులు ఇచ్చి ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాల్ని మేనిఫెస్టోలో చేర్చనున్నారని నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో జనానికి సంబంధించి పథకాలేవీ అమలుకు నోచుకోవని, ఇందుకు 2014 ఎన్నికల ప్రణాళికే నిదర్శనమని నెటిజన్లు ఆధారాలతో సహా చాకిరేవు పెడుతున్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే జనానికి గోరంత, ఎల్లో గ్యాంగ్ కొండంత దోచుకునేందుకు రహస్యంగా దాచి పెట్టిన ఎన్నికల ప్రణాళిక ఒకటి వుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నమ్మేవాళ్లుంటే మోసగించడానికి చంద్రబాబు ఎప్పుడూ సిద్ధంగా వుంటారని, మరోసారి ఆ పని చేయడానికి మహానాడు వేదికను వాడుకుంటారని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.