ఏ రోజైతే టీడీపీపై లోకేశ్ పెత్తనం మొదలైందో, ఆ క్షణం నుంచి పార్టీకి బ్యాడ్ డేస్ మొదలయ్యాయనే అభిప్రాయం బలంగా ఉంది. లోకేశ్ చేష్టలు టీడీపీకి నష్టం కలిగించేలా ఉన్నాయని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అంతెందుకు చంద్రబాబును అరెస్ట్ చేస్తే, లోకేశ్ పలాయనం చిత్తగించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
లోకేశ్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయిని, చేష్టలు మాత్రం గడప దాటడం లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న చంద్రబాబుకు సంఘీభావంగా ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు చేపట్టిన కార్యక్రమాలు విమర్శలకు దారి తీశాయి. విజిల్స్, ప్లేట్లు, డప్పులు కొట్టడం, అలాగే లైట్లు నిలిపేసి, దీపాలు వెలిగించడం లాంటి కార్యక్రమాలు సంతోషాన్ని వెలుబుచ్చేలా ఉన్నాయనే చర్చకు తెరలేచింది.
దసరాను పురస్కరించుకుని నారా లోకేశ్ మరో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారని ఎల్లో మీడియా తెగ ఊదరగొడుతోంది. అయితే ఆయన పిలుపు కాస్త… భూమరాంగ్ అయ్యిందని చెప్పొచ్చు. బాబు అరెస్ట్ను నిరసిస్తూ విజయ దశమి పండగ రోజు ‘దేశం చేస్తోంది రావణాసుర దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం’ అనే కార్యక్రమానికి లోకేశ్ పిలుపునిచ్చారు
అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని ప్రతి ఒక్కరూ నినదించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 23న విజయదశమి రోజు రాత్రి 7 నుంచి 7.05 నిమిషాల మధ్యలో వీధుల్లోకి వచ్చి `సైకో పోవాలి` అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరాను సెలబ్రేట్ చేసుకుందామని లోకేశ్ అన్నారు.
లోకేశ్ పిలుపుపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ‘దేశం చేస్తోంది రావణాసుర దహనం – లోకేశ్ చేస్తున్నాడు తెలుగుదేశాసుర దహనం’ అంటూ దెప్పి పొడుస్తున్నారు. విజయ దశమి పర్వదినంతో సంబంధం లేకుండానే లోకేశ్ తన తాత పార్టీని సర్వనాశనం చేస్తున్నారని వెటకరిస్తున్నారు.
తండ్రి జైల్లో వుంటే ఏ కొడుకొనా పార్టీని పట్టించుకోకుండా తన సుఖం చూసుకుంటారా? అలాంటి ఒకే ఒక్కడు లోకేశ్ తప్ప అని చావగొడుతున్నారు. ఇలాంటి వారసుడి వల్ల తెలుగుదేశానికి చావు తప్ప బతుకు వుంటుందని ఎవరైనా ఊహించగలరా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.