న‌ట‌న‌లో తండ్రే అనుకున్నాం…త‌న‌య అంతకు మించే!

ఏపీ బీజేపీ అధినేత్రి పురందేశ్వ‌రిని వైసీపీ టార్గెట్ చేసింది. బీజేపీ రాష్ట్ర నాయ‌కురాలిగా వైసీపీపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా, కిక్కురుమ‌ని ఉంటార‌ని ఆమె భావించిన‌ట్టున్నారు. అందుకే ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మొద‌లు…

ఏపీ బీజేపీ అధినేత్రి పురందేశ్వ‌రిని వైసీపీ టార్గెట్ చేసింది. బీజేపీ రాష్ట్ర నాయ‌కురాలిగా వైసీపీపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా, కిక్కురుమ‌ని ఉంటార‌ని ఆమె భావించిన‌ట్టున్నారు. అందుకే ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మొద‌లు వైసీపీ ప్ర‌భుత్వంపై పురందేశ్వ‌రి ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అలాగే ఏపీ ప్ర‌భుత్వ అప్పుల‌పై కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు.

ఈ నేప‌థ్యంలో పురందేశ్వ‌రికి వైసీపీ నుంచి తీవ్ర కౌంట‌ర్లు ఎదుర‌వుతున్నాయి. ఈ ప‌రిణామాన్ని ఆమె అస‌లు ఊహించ‌లేదు. దీంతో పురందేశ్వ‌రి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ట్విట‌ర్ వేదిక‌గా పురందేశ్వ‌రిపై వైసీపీ ముఖ్య నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి చీవాట్లు పెట్టారు. న‌ట‌న‌లో తండ్రిని మించిపోయార‌ని వెట‌క‌రించారు.

“అమ్మా, పురందేశ్వరిగారు…బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదు! బాబుది స్క్రిప్ట్‌… వదినది డైలాగ్‌! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ…మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్! మీ నాన్నగారు మహానటులు… మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే!”

పురందేశ్వ‌రిని మ‌హాన‌టిగా వైసీపీ చిత్రీక‌రిస్తోంది. అందుకే రాజ‌కీయాల్లో ఆమె న‌ట‌న‌ను విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌త్యేకంగా అభినందించారు. 2013, మే 7న పార్ల‌మెంట్ భ‌వ‌నంలో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తున్న సంద‌ర్భంగా పురందేశ్వ‌రి పెట్టిన పోస్టును ఇవాళ విజ‌య‌సాయిరెడ్డి ట్విట‌ర్‌లో షేర్ చేశారు. 

నాడు త‌న తండ్రిని కీర్తిస్తూ, అలాంటి గొప్ప వ్య‌క్తి విగ్ర‌హాన్ని పార్ల‌మెంట్‌లో పెట్టేందుకు అంగీక‌రించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, నాటి లోక్‌స‌భ స్పీక‌ర్ మీరా కుమార్ గారికి పురందేశ్వ‌రి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డాన్ని విజ‌య‌సాయిరెడ్డి గుర్తు చేయ‌డం విశేషం. టీడీపీ కోస‌మే పురందేశ్వ‌రి ప‌ని చేస్తున్నార‌నే సంకేతాల్ని ముందుకు తీసుకెళ్ల‌డంలో వైసీపీ విజ‌య‌వంతంగా సాగుతోంది.