ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవాకులు చెవాకులు పేలారు. కనీసం ఓ మహిళా మంత్రి గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియనంత విచక్షణ మరిచి ప్రవర్తించారు. చింతమనేని వ్యాఖ్యలను మంత్రి విడదల రజిని అసహ్యించుకున్నారు. చింతమనేనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రవర్తన గురించి అందరికీ తెలుసు. సంస్కారం లేకుండా మాట్లాడ్డంలో చింతమనేని తనకు తానే సాటి అని అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు. టీడీపీ హయాంలో ఆయన అరాచకాలు అన్నీఇన్నీ కావు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన మొదట్లో… పలు కేసుల్లో చింతమనేని అరెస్ట్ అయ్యారు. పోలీసుల చేతిలో తగిన సన్మానం పొందారు. ఈ విషయాన్ని తనే అభినయిస్తూ మీడియా ముఖంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయనలో మార్పు రాలేదు.
తాజాగా ఏలూరులో ఇంజనీరింగ్ విద్యార్థినిపై దారుణ దాడికి పాల్పడిన ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంజనీరింగ్ విద్యార్థినిని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. ఆస్పత్రిలో బర్నింగ్ వార్డ్లో సరైన సౌకర్యాలు లేకపోవడంపై సూపరింటెండెంట్ విజయ్కుమార్తో మాజీ ఎమ్మెల్యే చింతమనేని సెల్ఫోన్లో మాట్లాడుతూ…మీ వైద్యశాఖ మంత్రి మేకప్ వేసుకుని తిరుగుతున్నారా? అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
రాజమండ్రి పర్యటనకు సోమవారం విడదల రజిని వెళ్లారు. ఈ సందర్భంగా చింతమనేని వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా, ఆమె ఘాటుగా స్పందించారు. కనీసం సభ్యత, సంస్కారం లేని నాయకుడి మాటలపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ఎమ్మార్వో వనజాక్షి విషయంలో చింతమనేని ప్రవర్తించిన తీరు అందరికీ తెలుసన్నారు. అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.
సంస్కారం లేకుండా మాట్లాడారని ఆగ్రహించారు. టీడీపీ హయాంలో వైద్య రంగానికి ఏమీ చేయలేదని విమర్శించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు.