చావైనా బతుకైనా రవితోనే… ప్లీజ్ మ‌మ్మ‌ల్ని వెత‌కొద్దు!

విశాఖ ఆర్కే బీచ్‌లో రెండు రోజుల క్రితం అదృశ్య‌మైన సాయిప్రియ ఆచూకీ దొరికింది. తాను బ‌తికే ఉన్నాన‌ని, ప్రియుడిని పెళ్లాడిన‌ట్టు స్వ‌యంగా ఆమే ఓ ఆడియో రిలీజ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆర్కే బీచ్‌లో భ‌ర్త‌కు…

విశాఖ ఆర్కే బీచ్‌లో రెండు రోజుల క్రితం అదృశ్య‌మైన సాయిప్రియ ఆచూకీ దొరికింది. తాను బ‌తికే ఉన్నాన‌ని, ప్రియుడిని పెళ్లాడిన‌ట్టు స్వ‌యంగా ఆమే ఓ ఆడియో రిలీజ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆర్కే బీచ్‌లో భ‌ర్త‌కు మ‌స్కా కొట్టి, ప్రియుడి చెంత‌కు చేరి, అంద‌ర్నీ మోస‌గించ‌డంపై విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

గ‌త సోమ‌వారం పెళ్లి రోజు కావ‌డంతో సాయిప్రియ త‌న భ‌ర్త శ్రీ‌నివాస‌రావుతో క‌లిసి విశాఖ ఆర్కే బీచ్‌కు వెళ్లింది. రాత్రి 7.30 గంట‌ల స‌మ‌యంలో భ‌ర్త‌కు ఫోన్ కాల్ రావ‌డంతో మాట్లాడ్డానికి ప‌క్క‌కు వెళ్లాడు. అదే స‌మ‌యంలో సాయిప్రియ అదృశ్య‌మైంది. ఫోన్‌లో మాట్లాడి వ‌చ్చే లోపు సాయిప్రియ క‌నిపించ‌క‌పోవ‌డంతో భ‌ర్త ఆందోళ‌న‌కు గురై విశాఖ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

స్పీడ్ బోట్లు, హెలికాప్ట‌ర్ సాయంతో హెలికాప్ట‌ర్‌తో స‌ముద్రంలో సాయిప్రియ కోసం గాలింపు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లోని శాంతినగర్‌కు చెందిన రవి అనే ప్రియుడితో వెళ్లిపోయింద‌నే స‌మాచారం బ‌య‌టికొచ్చింది. సాయిప్రియ‌, భ‌ర్త శ్రీ‌నివాస్ విశాఖ‌లోని సంజీవ‌న‌గ‌ర్‌లో ఉంటున్నారు. ప్రియుడిపై మోజుతో భ‌ర్త‌, ఇరువైపు కుటుంబ స‌భ్యుల్ని ఆమె మ‌భ్య‌పెట్టింది. తాజాగా తండ్రికి విన్న‌వించుకుంటూ వాయిస్ మెసేజ్‌ని సాయిప్రియ పంపింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అందులో ఏముందంటే…

‘నాన్న.. నేను సాయిని మాట్లాడుతున్నాను. నేనేం చచ్చిపోలేదు. బతికే ఉన్నాను. నేను రవితోనే ఉన్నాను. మేమిద్ద‌రం ఎప్ప‌టి నుంచో ల‌వ్ చేసుకుంటున్నాం. న‌న్ను రవి బలవంతంగా తీసుకెళ్లలేదు. మా ఇద్దరికీ పెళ్లి కూడా అయిపోయిది. దయచేసి నాకోసం వెతకొద్దు నాన్న నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు. చావైనా బతుకైనా రవితోనే. ప్లీజ్‌ మమ్మల్ని వెత‌కొద్దు. ఒకవేళ నా కోసం వెతికితే ఇద్ద‌రం క‌లిసి చ‌చ్చిపోతాం. ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రం ఉండలేం. రవి పేరెంట్స్‌ను ఏమీ చేయొద్దు. ప్ర‌భుత్వానికి క్ష‌మాప‌ణ చెబుతున్నాను. న‌న్ను క్ష‌మించాలి’ అంటూ వాయిస్‌ మెసేజ్‌ చేసింది.  

తాళిబొట్టుతో ఉన్న పెళ్లి ఫొటోను త‌ల్లిదండ్రుల‌కు వాట్స‌ప్‌లో పంపింది.  ప్ర‌స్తుతం ఆమె బెంగ‌ళూరులో ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదిలా వుండ‌గా భ‌ర్త ఫిర్యాదుతో సాయిప్రియ‌పై విశాఖ పోలీసులు కేసు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం. సాయిప్రియ చేసిన ప‌ని వ‌ల్ల …నిజంగా ఏవైనా దుర్ఘ‌ట‌న‌ల‌పై ఫిర్యాదు అందినా పోలీసులు, ప్ర‌భుత్వ యంత్రాంగం న‌మ్మ‌లేని ప‌రిస్థితి త‌లెత్తింద‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. పెళ్ల‌యిన రెండేళ్ల త‌ర్వాత ప్రియుడి కోసం సినిమాను త‌ల‌పించే డ్రామాను క్రియేట్ చేయ‌డంపై జ‌నం మండిప‌డుతున్నారు.