జనసేనాని పవన్కల్యాణ్పై ఊహించినట్టుగానే ఎల్లో మీడియా దాడి మొదలు పెట్టింది. ఇంత కాలం వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని పవన్ అంటుంటే టీడీపీ సంబరపడింది. తమ పల్లకీ మోయడం తప్ప, పవన్కు మరో గత్యంతరం లేదని టీడీపీ నేతలు అనుకున్నారు.
పవన్ మద్దతుతో కాపుల ఓట్లను గంప గుత్తగా దండుకోవచ్చని టీడీపీ ఆశించింది. అయితే వారాహి యాత్ర మొదలు పెట్టిన పవన్కల్యాణ్, తాను సీఎం రేస్లో ఉన్నానని, జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజానీకాన్ని వేడుకోవడంతో టీడీపీ షాక్కు గురవుతోంది.
మరేంటి ఇంత కాలం టీడీపీతో పొత్తు వుంటుందని, ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందలేనని పవన్ అన్న మాటల్లో నిజం లేదా? అనే చర్చకు తెరలేచింది. పవన్కల్యాణ్ వరుసగా నిర్వహిస్తున్న సభల్లో తాను సీఎం అభ్యర్థిగా చెప్పుకోవడంపై ఎల్లో మీడియా గుర్రుగా వుంది. ఇంతకాలం తమ వాడే అని పవన్ను మోస్తూ వచ్చిన ఎల్లో మీడియా, యూ టర్న్ తీసుకుంది. పవన్ను ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది.
అనుకూలమైన విశ్లేషకులతో పవన్ను తిట్టిస్తోంది. బీజేపీ మాట విని తానే ముఖ్యమంత్రి అవుతానని పవన్ ప్రకటించడం ఏంటని టీడీపీ అనుకూల విశ్లేషకుడు నిలదీశారు. ఎట్లా అవుతావని ఆయన నిలదీశారు. కనీసం నాలుగు శాతం ఓట్లు కూడా లేవని, అలాగే పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, 14 ఏళ్లలో కనీసం అసెంబ్లీ గేటును కూడా తాకలేకపోయాడని తూర్పారపట్టారు. ప్రజల నమ్మకాన్ని చూరగొనకపోవడం వల్లే అసెంబ్లీ గేటును కూడా తాకలేకపోయావని పవన్పై మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కావాలని డిసైడ్ అయ్యానని పవన్ ఎలా ప్రకటించుకుంటారు? ప్రజలు కదా డిసైడ్ కావాల్సింది అని సదరు టీడీపీ అనుకూల విశ్లేషకుడు ప్రశ్నించారు. కనీసం 30 నియోజకవర్గాల్లో జనసేనకు అభ్యర్థులు కూడా లేరని గాలి తీశారు. వైఎస్ జగన్ ట్రాప్లో పవన్ పడ్డారని ఆయన ఆరోపించారు. ఇలాగైతే మరోసారి జగనే సీఎం అవుతారని ఆయన ఆక్రోశం వెళ్లగక్కారు. ఎల్లో చానల్ ప్రజెంటర్ కూడా పవన్ను నిలదీయడం గమనార్హం. మున్ముందు పవన్ను మరింతగా టార్గెట్ చేస్తారనేందుకు ఇదే నిదర్శనం.