టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ఏపీ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆయనకు సానుకూల తీర్పు రాలేదు. దీంతో ఆయన అరెస్ట్కు రంగం సిద్ధమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన్ను 14వ నిందితుడిగా సీఐడీ దర్యాప్తు బృందం చేర్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అరెస్ట్ భయం లోకేశ్ను వెంటాడుతోంది. అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన ఢిల్లీలో ఉండిపోయారనే ప్రచారం జరుగుతోంది. న్యాయ స్థానంలో ఉపశమనం కోసం లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. లోకేశ్ పిటిషన్ను హైకోర్టు ఇవాళ డిస్పోజ్ చేసింది. దీంతో ఆయనకు షాక్ తగిలినట్టైంది.
భారీ లబ్ధికి సంబంధించిన కేసు కావడంతో హైకోర్టు సీరియస్గా వుంది. అందుకే లోకేశ్కు ఊరట లభించలేదని న్యాయవాదులు చెబుతున్నారు. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు లోకేశ్ను ఆదేశించడం గమనార్హం.
అసలే స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్తో టీడీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గోరుచుట్టుపై రోకటి పోటు అనే చందంగా తాజాగా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడం కోలుకోలేని దెబ్బగా చెప్పొచ్చు. దర్యాప్తునకు లోకేశ్ సహకరిస్తారా? లేక పైకోర్టుకు వెళ్తారా? అనేది చర్చనీయాంశమైంది.