
సుప్రీంకోర్టులో వైసీపీ సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది. అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు ఊరట దక్కింది. ఇవాళ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు కీలక కేసులు విచారణకు వచ్చే సంగతి తెలిసిందే. అంగళ్లు కేసు, అలాగే చంద్రబాబు క్వాష్ పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చాయి.
ఇందులో క్వాష్ పిటిషన్పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. అంగళ్లు కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి, నల్లారి కిషోర్కుమార్రెడ్డిలకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సుప్రీం ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసులో సాక్ష్యులుగా పోలీసులను పేర్కొనడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది. అయితే పోలీసు అధికారులు గాయపడ్డారని, కానిస్టేబుల్ ఫిర్యాదుదారని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులే, సాక్ష్యులుగా ఉంటారా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ కేసులో జోక్యం చేసుకోడానికి ధర్మాసనం నిరాకరించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దీంతో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టైంది. క్వాష్ పిటిషన్పై తీర్పు రావాల్సి వుంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా