ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు మూడు పార్టీల కండువాలను వేసుకుంటున్నారు. అయితే ఒకే ఒక్క నియోజకవర్గంలో మాత్రం బీజేపీ కండువా వేసుకోడానికి టీడీపీ అభ్యర్థి ససేమిరా అంటున్నారు. బీజేపీ కండువా వద్దే వద్దు సామి అని తెగేసి చెబుతున్నారు. ఆ పార్టీ కండువా వేసుకుంటే వచ్చే నాలుగు ఓట్లు కూడా పోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కండువా అంటే చాలు... నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ వద్దే వద్దని అంటున్నారు.
నంద్యాలలో ముస్లింల ఓట్లు ఉన్నాయనే ఉద్దేశంతో భూమా బ్రహ్మానందరెడ్డిని కాదని మాజీ మంత్రి ఫరూక్కు టీడీపీ సీటు ఇచ్చింది. జనసేన, టీడీపీ కండువాలు వేసుకుని ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే మరో మిత్రపక్ష పార్టీ బీజేపీ కండువా వేసుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఇదేంటని ఎవరైనా అడిగితే... "ఏం నేను ఓడిపోవాలని అనుకుంటున్నారా? బీజేపీ కండువా వేసుకుంటే మా వాళ్లు ఓట్లు వేస్తారా?" అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు.
బీజేపీతో పొత్తు వల్ల ముస్లింలు భయపడుతున్నారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే, నాలుగు శాతం రిజర్వేషన్లు తీసేస్తారని, అలాగే సీఏఏ అమల్లోకి వచ్చి, తమను ఇక్కడ ఉండనివ్వరనే భయం వారిని వెంటాడుతోంది. దీంతో బీజేపీని , ఆ పార్టీతో అంటకాగుతున్న టీడీపీ, జనసేనను ఓడించడానికి ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు సిద్ధంగా ఉన్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన మాజీ మంత్రి ఫరూక్ బీజేపీ కండువా వేసుకోడానికి ససేమిరా అంటున్నారు.
అయితే ఓటర్లు మాత్రం ఫరూక్ను ముస్లిం నాయకుడిగా కంటే, కూటమి అభ్యర్థిగానే చూస్తున్నారు. మనోడని ఫరూక్కు ఓటు వేస్తే, తమ నెత్తిన భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టే అని నంద్యాల ముస్లింలు భావిస్తున్నారు. ఫరూక్ కంటే తెలివిగా నంద్యాల ముస్లింలు ఆలోచిస్తున్నారనేది నిజం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు