విజ‌య‌సాయి, కొడాలి నానిల‌కు ఆమె వార్నింగ్‌!

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఇటీవ‌ల కాలంలో వార్త‌ల్లో నిలిచారు. చంద్ర‌బాబుతో బంధుత్వం, తండ్రి స్థాపించిన టీడీపీపై అబిమానం వెర‌సి… వైసీపీని అంత‌మొందించాల‌ని ద‌గ్గుబాటి కంక‌ణం క‌ట్టుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇసుక‌, మ‌ట్టి,…

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఇటీవ‌ల కాలంలో వార్త‌ల్లో నిలిచారు. చంద్ర‌బాబుతో బంధుత్వం, తండ్రి స్థాపించిన టీడీపీపై అబిమానం వెర‌సి… వైసీపీని అంత‌మొందించాల‌ని ద‌గ్గుబాటి కంక‌ణం క‌ట్టుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇసుక‌, మ‌ట్టి, మ‌ద్యం త‌దిత‌ర అంశాల్లో అవినీతి జ‌రుగుతోంద‌ని ద‌గ్గుబాటి తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా విజ‌య‌సాయిరెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌కు ఆమె లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ నేప‌థ్యంలో ద‌గ్గుబాటిపై విజ‌య‌సాయిరెడ్డి ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతున్నారు. మ‌రిది చంద్ర‌బాబు క‌ళ్ల‌ల్లో ఆనందం కోసం  పురందేశ్వ‌రి త‌న సొంత పార్టీ అయిన బీజేపీని ఎలా తాక‌ట్టు పెడుతున్నారో విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు. అలాగే ఎయిర్ ఇండియా కుంభ‌కోణంలో పురందేశ్వ‌రి పాత్ర‌, ఇసుక , మ‌ద్యం విక్ర‌యాల‌పై ఆమె విమ‌ర్శ‌ల వెనుక దాగి వున్న బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాల‌ను విజ‌య‌సాయిరెడ్డి ఆవిష్క‌రించారు.

ఇక కొడాలి నాని విష‌యానికి వ‌స్తే.. పురందేశ్వరి లాంటి కూతురు ఏ తండ్రికి వ‌ద్ద‌ని అన్నారు. పురందేశ్వ‌రి వాల‌కం చూస్తూ ఎన్టీఆర్ ఆవేద‌న చెందుతుంటార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి, కొడాలి నానిల ఆరోప‌ణ‌ల‌ను దృష్టిలో పెట్టుకుని పురందేశ్వ‌రి ఘాటుగా స్పందించారు. ప్రకాశం జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అవినీతిపై తాను ప్ర‌శ్నిస్తే స‌మాధానం చెప్ప‌లేక‌, అధికార పార్టీ నేత‌లు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నార‌ని మండిప‌డ్డారు. అధికార పార్టీ నేత‌ల తాటాకు చ‌ప్పుళ్ల‌కు బీజేపీ నేత‌లు భ‌య‌ప‌డ‌ర‌ని ఆమె వార్నింగ్ ఇచ్చారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అరాచ‌క‌, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్నార‌ని విమ‌ర్శించారు. వైసీపీ సామాజిక సాధికార యాత్ర‌ల పేరిట మోసం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. ఆ యాత్ర‌లు నిర్వ‌హించే నైతిక హ‌క్కు వైసీపీకి లేద‌ని ఆమె అన‌డం గ‌మ‌నార్హం.