మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్ బస్సుయాత్ర విజయవాడలో సాగుతుండగా ఆయనపై అగంతకుడు రాయితో దాడి చేశారు. దీంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో రక్త గాయమైంది. ప్రధాని నరేంద్రమోదీ వెంటనే స్పందించి... త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితర ప్రముఖులు దాడిని ఖండించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొక్కుబడిగా దాడిని ఖండించారు. ఈ దాడిని ఆయన వెటకరిస్తూ మాట్లాడకుండా వుండరు. అది కూడా ఒకట్రెండుల్లో చూడొచ్చు. అయితే జగన్పై భౌతిక దాడిని మాత్రమే చూస్తున్నాం. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కొన్నేళ్లుగా ఎల్లో మీడియాలో జరుగుతున్న దాడి మాటేంటి? బహుశా దేశంలో మరే రాజకీయ నాయకుడిపై మీడియాలో ఇంతలా దారుణమైన దాడి జరిగి వుండదు.
ఎల్లో మీడియాలో ప్రతి నిత్యం పుంఖాను పుంఖాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసత్య, అసభ్య కథనాలు వండి వారుస్తూ చేస్తున్న దాడితో పోలిస్తే... ఈ రాయి దాడి ఓ లెక్కా? అంతెందుకు, ఇవాళ్టి ఆర్కే పత్రికలో వైఎస్ భారతి ప్రజల మధ్యలో నిలిచి, తన భర్త జగన్కు చేతులు ఊపుతూ ప్రోత్సహించడాన్ని కూడా బిల్డప్గా రాయడం... వైఎస్ కుటుంబంపై దాడి కాకుండా మరేం అవుతుంది?
ఇక చంద్రబాబు రాజగురువు పత్రికలో ప్రతి నిత్యం, ప్రతి పేజీలో జగన్కు వ్యతిరేక కథనాలు, వార్తల్ని చూడొచ్చు. ఎన్నికల సమయం కావడంతో ఇంటింటికి ఉచితంగా విష పత్రికని పంపే సంగతి తెలిసిందే. పత్రికలు చూడాలంటేనే పాఠకుడు భయపడేంతగా ఆ రెండు పత్రికల్లో జగన్పై విషాన్ని గుమ్మరిస్తున్నారు. నాడు వైఎస్సార్పై, నేడు ఆయన కుమారుడు జగన్పై దుర్మార్గ కథనాలు రాయడానికి పత్రికలు నడుపుతున్నారేమో అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.
విజయవాడలో జగన్పై రాయితో దాడి చేస్తే, అది ప్రధాన అంశం కాలేదు ఆ పత్రికలకి. పాఠకులు, ప్రజల్లో అనుమానం కలిగించడమే ఎజెండాగా అక్షరాన్ని వక్రమార్గం పట్టించడాన్ని ఆ రెండు పత్రికల్లో చూడొచ్చు. ఇది జగనే చేయించుకున్నాడని ప్రజలు అనుకోవాలనే తాపత్రయంతో ఆ రెండు పత్రికలు కథనాల్ని వండివార్చాయి. ఈ మీడియా దాడితో పోలిస్తే... జగన్పై రాయి దాడి పెద్ద సంగతేమీ కాదు. ఎల్లో మీడియా గత కొన్నేళ్లుగా చేస్తున్న మానసిక దాడిని తట్టుకుని, ప్రజాబలాన్ని కూడగట్టుకుని ఇవాళ లీడర్గా జగన్ నిలబడ్డారు. అదే ఎల్లో మీడియాకు, తెలుగుదేశం, జనసేన తదితర ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు