జనసేనాని పవన్కల్యాణ్కు అసలు ఏమైంది? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎన్నికల ప్రచారంలో తమ కూటమిని ఎందుకు గెలిపించుకోవాలో చెప్పడం మానేసి, జగన్ను తిట్టడానికే సరిపోతోంది. ఈ ధోరణి తమకు ఓట్లు తెచ్చి పెడుతుందని ఆయన ఎలా అనుకుంటున్నారో మరి! మరీ ముఖ్యంగా కాపులను జగన్పై రెచ్చగొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది.
రాజకీయాల్లో కేవలం కులాన్ని అడ్డం పెట్టుకుని ప్రయోజనాలు పొందాలనుకోవడం అవివేకమే. పదేపదే తన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తే, ఇతర సామాజిక వర్గాలను దూరం చేసుకుంటారనే ఇంగితం ఆయనలో కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆయన జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీకి ఓటేస్తే మనల్ని మనమే కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకున్నట్టే అని హెచ్చరించారు.
జగన్ ప్రభుత్వానికి అసలు ఓటెందుకు వేయాలని పవన్ ప్రశ్నించారు. ‘ఐదేళ్ల పాలనలో అవినీతిలో మునిగిపోయినందుకా? మెగా డీఎస్సీ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకా? పోలవరం పూర్తి చేయకుండా అన్నదాతలను మోసం చేసినందుకా?’ అని ఆయన నిలదీశారు. ఓకే... మరి కూటమికి ఓటెందుకు వేయాలో చెబితే కదా ఓటర్లు ఆలోచించేది. మరి ఆయన ఆ పని ఎక్కడ చేస్తున్నారు.
ఎంతసేపూ జగన్ను తిట్టడానికే సమయం సరిపోవడం లేదు. కూటమికి ఓటు వేస్తే, ఫలానా మంచి చేస్తామని చెప్పాల్సిన అవసరం వుందని కూడా ఆయన ఆలోచిస్తున్నట్టు లేదు. కేవలం వైసీపీని, సీఎం జగన్ను తిడితే చాటు, జనం ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. అందుకే ఆయన నోటికొచ్చినట్టు దూషిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. ఇక ఆయన జోస్యాలు నవ్వు తెప్పిస్తుంది.
కాపు రిజర్వేషన్ కోసం తునిలో జరిగే సభలో ఏదో దుర్ఘటన జరుగుతుందని తనకు ముందే సమాచారం వచ్చిందని ఆయన తన మార్క్ రాజకీయ బాంబు పేల్చారు. ఇలాంటి అతిశయోక్తులు చెప్పడం కేవలం పవన్కే సాధ్యమనే భావన ప్రజల్లో వుంది. అందుకే ఆయన కామెంట్స్ను చివరికి సొంత పార్టీ వారు కూడా లైట్ తీసుకుంటారు.
కాపులను రెచ్చగొట్టాలని జగన్పై ఏవేవో ఆరోపణలు చేస్తే, చివరికి అవి తనకే ఎదురు తిరుగుతాయని పవన్ గ్రహిస్తే మంచిది. ఎందుకంటే, కాపులతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూటమికి దూరమవుతున్నాయని పవన్ గుర్తించి అందుకు తగ్గట్టు మసలుకుంటే మంచిది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు