తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత దూకుడు ప్రదర్శించారు. ఏపీ మహిళా కమిషన్పై తెలుగు మహిళ ఇవాళ పైచేయి సాధించింది. తనను కించపరిచేలా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను తమ కార్యాలయానికి రప్పించి మహిళలను గౌరవించడంపై ప్రత్యేక క్లాస్ ఇస్తామని మహిళా కమిషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్కు చంద్రబాబు, బొండా ఉమా వెళ్లడంపై ఉత్కంఠ నెలకుంది. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామం చేటుకుంది.
మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నేతృత్వంలో ముట్టడించారు. దీంతో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళా కమిషన్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు అనితతో పాటు ఇటీవల విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన యువతి కుటుంబ సభ్యులు, తెలుగు మహిళలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకున్నారు.
తమను అడ్డుకోవడంపై అనిత పోలీసులను నిలదీశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ను కలిసేందుకు వెళుతున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను అనిత నిలదీశారు. తాను కూడా ఎమ్మెల్యేగా పని చేశానని, చట్టాలు తెలుసని పోలీసులకు క్లాస్ తీసుకున్నారు. తమను అనుమతించకపోతే, వాసిరెడ్డి పద్మనే ఇక్కడికి రప్పించాలని అనిత పట్టుపట్టారు.
దీంతో చేసేదేమీలేక అనితతో పాటు మరికొందరిని మహిళా కమిషన్ కార్యాలయంలోకి అనుమతించారు. మహిళా కమిషన్ ఛాంబర్లో వాసిరెడ్డి పద్మ, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తన పట్ల చంద్రబాబు, బొండా ఉమా వ్యవహరించిన వైఖరిపై మీ అభిప్రాయం చెప్పాలని అనితను వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.
ఇదే సందర్భంలో జగన్ పాలనలో ఊరికో ఉన్మాది పేరిట రూపొందించిన పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అనిత అందజేశారు. 800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎంత మందికి నోటీసులు ఇచ్చారని నిలదీశారు. బాధితురాలి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తామన్న మహిళ కమిషన్ కార్యదర్శిపై అనిత మండిపడ్డారు.