ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి వరుస తీపి కబుర్లు. నిన్న ఏసీబీ దర్యాప్తుపై స్టే, నేడు సిట్ దర్యాప్తుపై స్టే. ఏది ఏమైతేనేం తాను ఆశించిన న్యాయాన్ని హైకోర్టు ద్వారా ప్రధాన ప్రతిపక్షం ఎప్పటికప్పుడు పొందుతూనే ఉంది. తాజాగా రాజధాని అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు బృందం తదుపరి చర్యలను నిలిపేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
రాజధాని భూముల అవినీతిపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్, టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలను పునఃసమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్ చేస్తూ తెదేపా నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదంతా దురుద్దేశంతో జరిగిందని వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పిటిషన్లో పేర్కొన్నారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మరో ప్రభుత్వం పునః సమీక్షించే అధికారంలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం … సిట్ తదుపరి చర్యలు నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తమ ప్రభుత్వంపై, అవినీతిపై జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై అడగడుగునా అవరోధాలు సృష్టిస్తున్నామనే ఆనందం టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు తమ నిర్ణయాలపై న్యాయస్థానాల్లో వరుస స్టేలు వస్తుండడం జగన్ సర్కార్ ఒకింత అసహనంగా ఉంది.