వైసీపీని ఇరుకున పెట్టేలా మ‌రో వీడియో!

సోష‌ల్ మీడియాలో కొన్ని వీడియోలు వైర‌ల్ కావ‌డం అధికార పార్టీ వైసీపీకి త‌ల‌నొప్పిగా మారుతోంది. ఒక‌వైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం సామాన్యుల‌పై రౌడీయిజం చేస్తోంద‌ని విమ‌ర్శ‌ల‌కు బ‌లం క‌లిగించేలా స‌ద‌రు వైర‌ల్ అవుతున్న వీడియోలు ఉన్నాయ‌నే…

సోష‌ల్ మీడియాలో కొన్ని వీడియోలు వైర‌ల్ కావ‌డం అధికార పార్టీ వైసీపీకి త‌ల‌నొప్పిగా మారుతోంది. ఒక‌వైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం సామాన్యుల‌పై రౌడీయిజం చేస్తోంద‌ని విమ‌ర్శ‌ల‌కు బ‌లం క‌లిగించేలా స‌ద‌రు వైర‌ల్ అవుతున్న వీడియోలు ఉన్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

రెండురోజుల క్రితం ప్ర‌కాశం జిల్లా వైసీపీ కార్య‌క‌ర్త‌, మంత్రి బాలినేని అనుచ‌రుడు సుబ్బారావు గుప్తాపై సొంత పార్టీకి చెందిన వ్య‌క్తే దాడి చేయ‌డం, సంబంధిత వీడియో వైర‌ల్ కావ‌డం అధికార పార్టీకి న‌ష్టం క‌లిగిస్తోంది. ఆ విష‌యాన్ని మ‌రిచిపోక‌నే అలాంటిదే మ‌రో వీడియో కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు మున్సిప‌ల్ చైర్మ‌న్ ర‌ఘు ఏకంగా త‌న త‌ల్లి స‌రోజ‌పై దాడికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఇది ఆ పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగించేదే అని వైసీపీ నాయ‌కులు వాపోతున్నారు. స‌ద‌రు చైర్మ‌న్ త‌ల్లి స‌రోజ కూడా ఎమ్మిగ‌నూరు మున్సిపాలిటీలో కౌన్సిల‌ర్‌ కావ‌డం గ‌మ‌నార్హం. ఆస్తి గొడ‌వ‌లే తల్లిపై దాడికి ఉసిగొల్పాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

కుమారుడి నుంచి త‌మ‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఎమ్మిగనూరు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఎస్పీలకు తల్లి సరోజ ఫిర్యాదు చేశారు. త‌మ ఇంటి కొచ్చి ర‌ఘు త‌ల్లిదండ్రుల‌తో పాటు కుటుంబ స‌భ్యుల‌పై దాడి చేసిన‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. అలాగే త‌మ ఇంటికి ర‌ఘు అనే వ్య‌క్తి వ‌చ్చాడ‌ని, కానిస్టేబుల్‌గా ప‌రిచ‌యం చేసుకుని, పోలీస్‌స్టేష‌న్‌కు ర‌మ్మ‌న్న‌ట్టు స‌రోజ తెలిపారు.

కానిస్టేబుల్‌గా చెబుతున్న ర‌వి, త‌న సెల్‌ఫోన్ లాక్కున్నాడ‌ని ఆమె వాపోయారు. మ‌ఫ్టీలో వ‌చ్చిన ర‌విని త‌న కుమారుడే పంపి ఉంటాడ‌ని ఆమె అనుమానించారు. క‌నీసం ఓ మ‌హిళా కానిస్టేబుల్‌ను పంపాల‌నే స్పృహ కూడా లేక‌పోవ‌డం విచార‌క‌రమ‌న్నారు.