ఏపీలో పంచాయతీ రాజ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీం కోర్టుకు చేరిన వ్యవహారంలో వివిధ శాఖల ఉద్యోగులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి తాము సిద్ధంగా లేమంటూ స్పష్టం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. కరోనా పూర్తిగా అదుపులోకి రాని నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు పెట్టి తమ బతుకులను అభద్రతలోకి నెట్టవద్దని ఉద్యోగ సంఘాలు ఏపీ ఎస్ఈసీని బహిరంగంగానే కోరుతున్నాయి.
ఇప్పటికే పలు సార్లు ఉద్యోగ సంఘాలు ఈ విషయంలో తమ అభ్యంతరాలను వ్యక్తం చేయగా.. వాటిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. తనతో సమావేశానికి వచ్చిన పార్టీల వారితో సమావేశాలను నిర్వహించడానికే చాలా జాగ్రత్తలు తీసుకున్న నిమ్మగడ్డ ఉద్యోగుల అభ్యంతరాలను మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. తనతో సమావేశం విషయంలో కరోనా నియమావళిని ఫాలో అయిన నిమ్మగడ్డ ఉద్యోగులు మాత్రం అన్నింటికీ తెగించి పని చేయాలన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు.
ఇక ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులు తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని హై కోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించగా, వారి పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తమను కూడా ఇంప్లీడ్ చేసుకోవాలన్న వారి వాదనను కోర్టు కొట్టి వేసింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు కోర్టు ఉద్యోగుల పిటిషన్ ను కొట్టివేసింది.
ఇక ఇప్పుడు ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణకు ఉద్యోగుల సంఘం తరఫు నుంచి కూడా పిటిషన్ దాఖలైనట్టుగా తెలుస్తోంది. ఏపీ ఉద్యోగుల ఫెడరేషన్ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ఉద్యోగుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించింది. మరి సుప్రీం కోర్టు ఈ పిటిషన్ పై ఎలా స్పందిస్తుందో అనేది ఆసక్తిదాయకంగా మారింది.
కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ అయినా.. ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని ఏపీ ఎన్జీవోలు కోరుతున్నారు. అయితే ఇలాంటి అభ్యంతరాలను ఎస్ఈసీ ఏ మాత్రం ఖాతరు చేసేలా లేదని స్పష్టం అవుతూనే ఉంది.