దేశంలో మొట్టమొదట కరోనా కేసులు వెలుగు చూసిన రాష్ట్రాల్లో ఒకటి కేరళ. ఒక దశలో కేరళలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా నమోదైంది. అయితే దేశంలో కరోనాకు కొంతలో కొంత నియంత్రణ అమలు చేయగలిగింది కూడా కేరళనే.
విద్యాధికుల రాష్ట్రంలో కేసుల సంఖ్య ముందుగా తగ్గుదల చోటు చేసుకుంది. అలాగే కాస్త ఫ్రీ సొసైటీ కావడంతో కూడా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. స్థూలంగా ఇప్పటి వరకూ ఆ రాష్ట్రంలో 8 లక్షలా 33 వేలకు పైగా కరోనా కేసులో నమోదయ్యాయి. కోలుకున్న వారి శాతం 90 వరకూ ఉంది.
ఆ నంబర్ల సంగతలా ఉంటే.. గత కొన్ని రోజులుగా దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రం కేరళ! అంతే కాదు.. గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలోనే ఎక్కడా లేని రీతిలో కరోనా కారణ మరణాలు నమోదు అయిన రాష్ట్రం కూడా కేరళనే. గత వారం రోజులుగా ఇలా అత్యధిక నంబర్లతో కేరళ విచారకరమైన పరిస్థితుల్లో నిలుస్తోంది.
ఒకవైపు దేశంలో కరోనా బాగా వ్యాప్తి చెందిన రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు నంబర్లు బాగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య ఐదారు వందల లోపుకు చేరింది. అయితే ఇదే సమయంలో కేరళలో రోజువారీ కేసుల సంఖ్య ఏకంగా ఆరు వేలకు పైగా నమోదవుతూ వస్తోంది రోజువారీగా!
ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు ఆరు వేలకు పైగా కేసులు అంటే.. మాటలేమీ కాదు. గత కొన్నాళ్లుగా కేరళలో ఈ పరిస్థితి నెలకొంది. గత ఇరవై నాలుగు గంటల్లో కేరళలో 21 మంది కరోనా కారణంగా మరణించినట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
మిగతా రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య వందల స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో కేరళల్లో ఏకంగా ఆరు వేలకు పైగా నమోదు కావడం గమనించాల్సిన అంశం.
ఇంతకీ కేరళల్లో ఈ కేసుల సంఖ్య ఎప్పటి నుంచి ఇలా మళ్లీ పెరుగుతోంది? అంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి సమాధానం ఇస్తోంది. స్థానిక ఎన్నికల తర్వాత తమ రాష్ట్రంలో కేసుల సంఖ్య బాగా పెరుగుతోందని కేరళ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ప్రకటించారు. అది కూడా కేంద్ర ప్రభుత్వ సమీక్షలో ఈ విషయాన్ని చెప్పారు.
మిగతా దక్షిణాది రాష్ట్రాలు కరోనా విపత్తు నుంచి కాస్త రిలాక్స్ అవుతున్న తరుణంలో కేరళ మాత్రం భారీ కేసులతో ఇబ్బంది పడుతూ ఉంది. రోజువారీగా కేసుల సంఖ్య పెరిగి, మరణాలు కూడా చోటు చేసుకుంటూ ఉండటంతో… మళ్లీ నివారణ చర్యల కోసం ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజువారీగా స్టడీగా కేసులు పెరుగుతూ ఉండటంతో.. కేరళ మళ్లీ లాక్ డౌన్ పరిమితులు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్తుంది. స్థానిక ఎన్నికలు నిర్వహించి విజయం సాధించిన ఉత్సాహంతో ఉంది అక్కడి అధికార పార్టీ. అయితే.. ఆ ఉత్సాహం కాస్తా ఎన్నికల తర్వాత పెరుగుతున్న కేసులతో ఆవిరి అవుతోంది.
ఈ పరిస్థితిని ఏపీకి అన్వయించవచ్చు. కచ్చితంగా అన్వయించాలి కూడా! ఏపీ ఎన్నికల కమిషన్ పంతానికి పోయి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే నిర్వహించుకోవచ్చు. అదేమంటే తనకు అధికారాలున్నట్టుగా ఎస్ఈసీ చెప్పుకుంటున్నారు. కోర్టులు కూడా అదే చెబుతున్నాయి. మరి రేపు ఎన్నికలు జరిగి ఏపీ పరిస్థితి కేరళల్లా తయారైతే.. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?
ఆ భారం కచ్చితంగా ప్రభుత్వం మీదే పడుతుంది.
అప్పుడు మళ్లీ ప్రభుత్వాన్ని నిందించొచ్చు! ప్రతిపక్షాలకు కూడా పని దొరుకుతుంది. ఎటొచ్చీ ఎన్నికల వల్ల కరోనా కేసుల సంఖ్య పెరిగి.. సామాన్యులు అకారణంగా బాధితులు అయితే.. వారే అన్యాయంగా ఇబ్బందుల పాలవుతారు.