సినిమా వాళ్లున్నారు…మీకేం ప‌ని!

ఏపీ బీజేపీ నేత‌ల‌కు చేయ‌డానికి ఏ ప‌నీ లేన‌ట్టుంది. జ‌నం న‌వ్వుతార‌ని కూడా అనుకోకుండా సంబంధం లేనివ‌న్నీ చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన ప్ర‌జాగ్ర‌హ స‌భ‌లో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము…

ఏపీ బీజేపీ నేత‌ల‌కు చేయ‌డానికి ఏ ప‌నీ లేన‌ట్టుంది. జ‌నం న‌వ్వుతార‌ని కూడా అనుకోకుండా సంబంధం లేనివ‌న్నీ చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన ప్ర‌జాగ్ర‌హ స‌భ‌లో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు చీప్ లిక్క‌ర్‌ను రూ.50కే అందిస్తామ‌ని ప్ర‌క‌టించి అభాసుపాల‌య్యారు. ఆయ‌న కామెంట్స్ దేశ వ్యాప్తంగా బీజేపీ ప‌రువు తీశాయి. సోము వీర్రాజుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట‌ర్ వేదిక‌గా రియాక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి సోము వీర్రాజు పొంత‌న లేని ప్ర‌క‌ట‌న చేసి…నెటిజ‌న్ల ట్రోలింగ్‌కు గురి అవుతున్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్ల విష‌యంలో ప్ర‌భుత్వ జోక్యం త‌గ‌ద‌ని అన్నారు. సినిమా టికెట్ల‌తో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మండ‌ల స్థాయి స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌ని అన్నారు. కేంద్రం నిధులు ఇస్తుంటే జ‌గ‌న్ సొంత ప‌థ‌కాలు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.

సినిమా టికెట్ల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వ నియంత్ర‌ణను తెలంగాణ ప్ర‌జానీకం ఆహ్వానిస్తోంది. తెలంగాణ‌లో థియేట‌ర్ల య‌జ‌మానుల స్వే చ్ఛ‌కు టికెట్ల పెంపును వ‌దిలేయ‌డంతో ప్రేక్ష‌కుల‌కు భార‌మైంది. దీంతో కేసీఆర్ స‌ర్కార్‌ను తెలంగాణ స‌మాజం తీవ్రంగా విమర్శిస్తోంది. అయినా టికెట్ల ధ‌ర‌ల పెంపుపై బీజేపీకి ఎందుకంత శ్ర‌ద్ధో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. 

సినిమా టికెట్ల థ‌ర‌ల పెంపుపై నిరస‌న వ్య‌క్తం చేస్తామ‌ని, మండ‌ల స్థాయిలో స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌ని బీజేపీ ప్ర‌క‌టించ‌డంపై నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఏ స‌మ‌స్య‌లూ లేక‌పోవ‌డంతో చివ‌రికి సినిమా టికెట్లపై బీజేపీ ప‌డింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోడానికి సినిమా రంగంలో చాలా మందే ఉన్నారు. ఆ స‌మ‌స్య‌లోకి బీజేపీ త‌ల‌దూర్చి అభాసుపాలు కాకుండా చూసుకోవాల‌ని నెటిజ‌న్లు హిత‌వు చెబుతున్నారు.