భారతీయ జనతా పార్టీ అంటే.. జాతీయ పార్టీ. ఏ విషయంలో అయినా ఆ పార్టీకి ఒకే విధానం ఉండాలి. అయితే.. ఎంత పార్టీ అయినప్పటికి అది రాజకీయ పార్టీనే కదా, కాబట్టి.. తను సగటు రాజకీయాలకు అతీతం కాదని బీజేపీ నిరూపించుకుంటూ ఉంటుంది.
60 యేళ్ల పాలన, 60 యేళ్ల పాలన అంటూ.. కాంగ్రెస్ ను తిట్టీ తిట్టీ బీజేపీ అధికారాన్ని సంపాదించుకుంది. ఒకటికి రెండోసారి కూడా నెగ్గి అధికారంలో ఉంది. అయితే గత కొన్నాళ్లుగా బీజేపీ తీరును గమనిస్తే మళ్లీ కాంగ్రెస్సే గుర్తుకు వస్తే తప్పు గమనించే వాళ్లది కాదు.
వివిధ రాష్ట్రాల్లో అధికారమే పరమావధిగా బీజేపీ చేస్తున్న రాజకీయాలు కాంగ్రెస్ కాలాన్నే గుర్తు చేస్తాయి. తమకు మెజారిటీ ఉన్నా లేకపోయినా ఎలాగోలా బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. ఈ క్రమంలో అవసరాన్ని బట్టి తను అనుసరిస్తున్న విధానాలను బీజేపీనే తుంగలోకి తొక్కుకొంటూ ఉండటం గమనార్హం.
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలోని ఒక ముఖ్యనేత అక్కడ సెక్స్ స్కాండల్ లో చిక్కుకున్నారు. ఇది బీజేపీ నైతికతకు ప్రశ్నగా మారుతూ ఉంది.
మరోవైపు గతంలో పెట్రో ధరల పెంపు విషయంలో బీజేపీ వాళ్లు అనేక సార్లు యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించారు. నాడు గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో నరేంద్రమోడీ పెట్రోల్ ధరల పెంపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అంటూ ట్వీట్ల కూడా చేసే వారు. అయితే ఇప్పుడు ఆయనే ప్రధానిగా ఉన్నప్పుడు పెట్రో ధరలకు హద్దు లేకుండా పోయింది. కొత్త రికార్డులను చేరుతున్నాయి పెట్రో ధరలు.
ఇక అప్పట్లో పెట్రో ధరల పెంపుకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమంటూ విమర్శించిన బీజేపీ నేత నిర్మలా సీతారామన్, ఇప్పుడు ఆర్థిక శాఖా మంత్రి హోదాలో మాట్లాడుతూ.. పెట్రో ధరలను నిర్ణయించేది ఆయిల్ కంపెనీలు అంటున్నారు! ఇందుకు సంబంధించి గతంలో ఈమె ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనే వీడియో వైరల్ గా మారింది సోషల్ మీడియాలో!
మాటలతో పబ్బం గడుపుకునే రోజులు బీజేపీకి పూర్తయినట్టుగా ఉన్నాయి. రెండోసారి నెగ్గాకా కూడా హనీమూన్ పీరియడ్ ముగిసింది. పెట్రో ధరల పెంపుతో సర్వ నిత్యవసరాల ధరలూ పెరుగుతున్నాయి. రవాణా చార్జీలు పెరగడంతో పాలు, కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి.
ఏసీ రూముల్లో కూర్చుని పని చేసుకుంటూ, ఆరంకెల శాలరీలు తీసుకునే వారికి ఈ నొప్పి తెలియకపోవచ్చు కానీ.. దేశంలో ఇంకా పేదలున్నారు, మధ్యతరగతి ఉంది! వారు ఈ ధరల పెంపును తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
అయితే వారితో తమకు పనే లేదన్నట్టుగా కమలం పార్టీ పాలన జాతీయ స్థాయిలో సాగుతూ ఉంది. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో నెగ్గుతూ ఉండటం వల్ల బీజేపీకి ఈ తరహా విధానాలను అనుసరించే ధైర్యం ఉండొచ్చు.
అయితే.. ప్రజావ్యతిరేకత అనేది ప్రతి సారీ బయటపడాల్సిన అవసరం లేదు. బయటపడే సమయంలో అది ఒక్కసారిగా బద్దలైతే.. కథ మరోలా ఉండవచ్చు!