విన్నారా.. ఢిల్లీ కాలుష్యానికి చైనా, పాక్ లే కారణమట!

దేశంలోని అంతర్గత వ్యవహారాలు అన్నింటికీ ఒకవైపు కాంగ్రెస్ ను బూచిగా చూపిస్తూ సాగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ పాలన! దేశ చరిత్రలో ఇప్పటి వరకూ పదేళ్లకు పైనే బీజేపీ వాళ్ల చేతిలో అధికారం…

దేశంలోని అంతర్గత వ్యవహారాలు అన్నింటికీ ఒకవైపు కాంగ్రెస్ ను బూచిగా చూపిస్తూ సాగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ పాలన! దేశ చరిత్రలో ఇప్పటి వరకూ పదేళ్లకు పైనే బీజేపీ వాళ్ల చేతిలో అధికారం నిలిచింది. గత ఐదేళ్ల నుంచి ఆ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంది. అయితే ఇప్పటికీ  ఏ సమస్య విషయంలో అయినా కాంగ్రెస్ పార్టీనే కారణమని బీజేపీ వాళ్లు వాదిస్తూ  ఉంటారు. అదీ కాదంటే హిందుత్వ వాదంతో ఎన్నికల వేళ బీజేపీ అదరగొడుతూ ఉంది.

ఇక కశ్మీర్ అంశం, పాక్ బూచి కూడా ఎప్పటికప్పుడు  బీజేపీకి అంది  వచ్చే ఆయుధాలు. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ నేతలు ఒక్కో అడుగే ముందుకు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఢిల్లీ ప్రాంతంలో నెలకొన్న  కాలుష్యానికి కూడా పాకిస్తాన్, చైనాలే కారణమని వాదించే వరకూ వచ్చారు కమలం పార్టీ నేతలు.

 మోడీ రెండోసారి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పాక్, చైనాలకు ఏ మాత్రం ఇష్టంలేదని, అందుకే అవి ఇండియాపై విష వాయువులను వదులుతున్నాయని వినీత్ అగర్వాల్ అనే యూపీ బీజేపీ నేత తేల్చారు. ఢిల్లీలో కాలుష్యాన్ని చైనా, పాక్ లే కలిగిస్తున్నాయని.. ఇండియాను  అలా దెబ్బతీయాలని ఆ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. 

మొత్తానికి అసలు సిసలు బీజేపీ నేత అంటే ఈయనే కాబోలు. ఇప్పటి వరకూ అన్నింటికీ కాంగ్రెస్సే కారణం అనే దశ దగ్గర నుంచి ఢిల్లీ కాలుష్యానికి పాక్, చైనాలే కారణమని తేల్చేంత వరకూ వచ్చారు బీజేపీ వాళ్లు! మోడీ భక్తులకు ఇలా కొత్త  ఆయుధాన్ని అందించారు బీజేపీ వాళ్లు. బహుశా కొన్ని రోజుల్లో ఈ వాదనను బలపరుస్తూ మోడీ  భక్తులు 'గట్టి'ఆధారాలే చూపవచ్చు!