సంచలన మెజారిటీలతో లోక్ సభలో వరస విజయాలను నమోదు చేసిన భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మాత్రం మెజారిటీ అందని ద్రాక్ష అవుతూ ఉంది. 2014 నుంచి అదే కథే చోటు చేసుకుంటూ ఉంది. ఆరేళ్లు గడిచిపోతున్నా రాజ్యసభలో మాత్రం బీజేపీ మెజారిటీ మార్కును అందుకోలేకపోతూ ఉంది. ఎన్డీయే రూపంలో కూడా బీజేపీకి మెజారిటీ దక్కకపోవడం గమనార్హం. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ బీజేపీ వాళ్లు నినాదాలు ఇస్తున్నా.. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని లోక్ సభలో కన్నా గట్టిగా చాటుకుంటూ ఉంది. అలాగే ప్రాంతీయ పార్టీలూ అక్కడ ఉనికి చాటుతూ ఉన్నాయి. ఈ క్రమంలో రాజ్యసభలో బలం భారతీయ జనతాపార్టీకి అందని ద్రాక్షలానే ఉంది.
ప్రస్తుత బలాబలాల విషయానికి వస్తే.. బీజేపీ ఖాతాలో సొంతంగా 75 రాజ్యసభ సీట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ 39 సీట్లను కలిగి ఉంది! జూన్ 19న రాజ్యసభ ఎన్నికల తతంగం జరగనుంది. ఈ క్రమంలో వచ్చే ఫలితాలను బట్టి.. భారతీయ జనతా పార్టీ తన బలాన్ని 84కు పెంచుకోనుంది. తొమ్మిది సీట్లు బీజేపీ ఖాతాలో చేరున్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను నష్టపోనుంది. తద్వారా రాజ్యసభలో కాంగ్రెస్ బలం 37 కు పరిమితం కానుంది.
కాంగ్రెస్ బలం కాస్త తగ్గినా, బీజేపీ బలం పెరిగినా.. కమలం పార్టీకి మెజారిటీ మాత్రం ఇప్పుడు కూడా దక్కదు. జూన్ 19 తర్వాత ఎన్డీయే రూపంలో బీజేపీ వెంట 100 మంది రాజ్యసభ సభ్యులుంటారు. 242 మంది సభ్యులున్న పెద్దల సభలో కనీస మెజారిటీ 122, కాబట్టి మెజారిటీకి ఎన్డీయే ఇంకా 22 మంది రాజ్యసభ సభ్యుల దూరంలో ఉన్నట్టే.
ఎన్డీయే, యూపీయేతర పార్టీలు.. ఏఐఏడీఎంకే, బీజేడీ, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ లు పెద్దల సభలో మరోసారి కీలకం కాబోతూ ఉన్నాయి. వైసీపీ ప్రస్తుతం ఇద్దరు ఎంపీలతో ఉండగా, దాని బలం జూన్ 19 తర్వాత ఆరుకు పెరగనుంది. బీజేపీకి కీలకమైన బిల్లుల విషయంలో కావాల్సిన 22 మంది ఎంపీల బలం ఇలా ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉండబోతూ ఉంది.