చంద్రబాబు శుద్దులు.. రొటీన్ కామెడీనే!

తమ పార్టీ వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు నాయుడు వాపోవడం కొనసాగుతూ ఉంది. అధికారం కోల్పోయిన ప్రతి సారీ చంద్రబాబు ప్రోగ్రామ్స్ ఇలానే ఉంటాయి. తమ పార్టీ వాళ్లపై కక్ష సాధింపు చర్యలు…

తమ పార్టీ వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు నాయుడు వాపోవడం కొనసాగుతూ ఉంది. అధికారం కోల్పోయిన ప్రతి సారీ చంద్రబాబు ప్రోగ్రామ్స్ ఇలానే ఉంటాయి. తమ పార్టీ వాళ్లపై కక్ష సాధింపు చర్యలు సాగుతున్నాయని ఆయన అంటూ ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు అలాంటి సానుభూతి వ్యక్తం చేసేది.. పరిటాల రవి, చింతమనేని ప్రభాకర్, కోడెల శివప్రసాద్ రావు వంటి వాళ్లపై.

వాళ్లేమిటో ఆయా ప్రాంతాల వాళ్లకు బాగా తెలుసు. అధికారం చేతిలో ఉన్నప్పుడు సదరు నేతలు, వారి కుటుంబీకుల తీరు ఎలా ఉంటుందో ఆ స్థానికులకు మరింత బాగా తెలుసు. అధికారంలో లేనప్పుడు వారిపై కేసులు వస్తాయి. వాటిని పట్టుకుని చంద్రబాబు నాయుడు వస్తారు! ఇదే సీరియల్ సాగుతూ ఉంది.

ఇలాంటి క్రమంలో చంద్రబాబు నాయుడు రొటీన్ శుద్దులు చెబుతూ ఉన్నారు. అందులో ముఖ్యమైనది ఏమిటంటే.. 'మా హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల మీద కేసులు పెడితే అసలు ఆ పార్టీ ఉండేదా?' అని చంద్రబాబు నాయుడు కర్నూలులో ప్రశ్నించేశారు!

తమ హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లపై అసలే మాత్రం కేసులు పెట్టలేదని, జగన్ మాత్రం తమ వారిపై కేసులు పెట్టిస్తున్నారని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తను గజినిగా మారిపోయి, ప్రజలు కూడా గజినీలుగా మారిపోయి అన్నీ మారిచిపోవాలని అనుకునే టైపు. 

ఒక పోలీసాఫీసర్ ను 'డోంట్ టచ్ మీ' అన్నందుకు భూమా నాగిరెడ్డి మీద కేసులు పెట్టింది తన హయాంలోనే అని చంద్రబాబు మరిచిపోయినట్టుగా ఉన్నారు. తన పార్టీలో చేరే వరకూ నాగిరెడ్డిని చంద్రబాబు నాయుడు ఎన్నిముప్పుతిప్పలు పెట్టారో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ నుంచి రోజాను ఏకంగా సంవత్సరం పాటు నిషేధించారు. ఆమె వెర్షన్ వినడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏడాది పాటు బయటకు పంపించారు! 

ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు, అందులో బెదిరింపుల, హెచ్చరికల, కేసుల.. ప్రలోభాలు ఎన్నో ఉన్నాయనేది బహిరంగ సత్యమే. అంత జరిగితే.. చంద్రబాబు నాయుడు రామప్పంతులులా నీతులు మాట్లాడుతూ ఉండటం ఆయన రొటీన్ కామెడీనే!