టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ అశోక్బాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. టీడీపీలో అశోక్బాబు క్రియాశీలకంగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ, ఉద్యోగుల ప్రయోజనాలను నాటి అధికార పార్టీకి తాకట్టు పెట్టాడనే ఆరోపణలను ఉద్యోగుల నుంచి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తమకు వ్యతిరేకంగా ఉద్యోగులను టీడీపీ వైపు మళ్లించాలని ప్రయత్నించాడని అశోక్బాబుపై వైసీపీ చాలా కాలంగా ఆగ్రహంగా ఉంది.
ఎట్టకేలకు ఆయన్ను సీఐడీ కేసులో ఇరికించింది. అశోక్బాబుపై పలు అభియోగాలు నమోదు కావడం, వాటిపై ఏపీ లోకాయుక్త విచారణ జరిపి కీలక ఆదేశాలు ఇచ్చింది. కేసును ఏపీ సీఐడీ విచారించాలని లోకాయుక్త ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఐడీ అశోక్బాబు పని పట్టేందుకు సిద్ధమైంది.
అశోక్బాబుపై ప్రధానంగా నమోదైన అభియోగాలేంటో తెలుసుకుందాం. అశోక్బాబు బీకాం చదవలేదు. కానీ చదివినట్టు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఏసీటీవోలో ఉద్యోగం సంపాదించుకున్నారు. అలాగే ఫోర్జరీ సంతకాలతో మోసానికి పాల్పడ్డాడు. బీకాం చదివినట్టు ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారు.
తనపై కేసులు పెండింగ్లో ఉండగానే ఏమీ లేనట్టు అఫిడవిట్లో తప్పుడు సమాచారం చేర్చారు. ఉద్దేశ పూర్వకంగానే సర్వీస్ రికార్డ్స్లో తప్పుడు సమాచారం ఇచ్చారని వైసీపీ చాలా కాలంగా ఆరోపిస్తుంది. కేసు నమోదు చేయడానికి ఇంత కాలం పట్టింది. ఈ కేసు నిలుస్తుందా? లేక మిగిలిన కేసుల మాదిరిగానే హైకోర్టులో కొట్టివేతకు గురి అవుతుందా? అనేది కాలమే తేల్చాల్చి వుంది. కానీ ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేసిందని చెప్పుకోవాల్సిందే.