దేశంలో కరోనా ఉధృతిలో మరో ప్రధానమైన అంశం ఇది. ఇప్పటికే రెండు వేవ్ ల కరోనాను చవిచూసిన భారత దేశంలో మూడో వేవ్ లో కూడా అధికారిక కేసుల సంఖ్య భారీగానే ఉంటోంది. అయితే.. ఈ సారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈ సారి అనధికారిక కేసుల సంఖ్య గతంలో కన్నా చాలా ఎక్కువగా ఉండవచ్చనేది.
ఫస్ట్ వేవ్ లో అనుమానితుల్లో చాలా మంది టెస్టులు చేయించుకున్నారు. అలాగే రెండో వేవ్ లో కూడా సింప్టమ్స్ కనిపించిన వారిని ప్రభుత్వమే గుర్తించింది. వారి ఇళ్ల వద్ద బ్లీచింగ్ చల్లడంతో పాటు, రెడ్ జోన్లూ, గ్రీన్ జోన్లు అంటూ.. రకరకాల విభజనలు చేసింది.
కేసుల విషయంలో ప్రభుత్వాలు చాలా డీప్ గా ఎనలైజ్ చేసుకున్నాయి. ప్రజల్లో కూడా భయాందోళనలు అధికంగా ఉండి.. కాస్త అనుమానం రాగానే టెస్టులు చేయించుకున్నారు. అయినప్పటికీ.. రెండో వేవ్ లో కూడా అధికారికంగా నమోదైన కేసుల కంటే అనధికారిక కేసుల సంఖ్య చాలా ఎక్కువ అనే మాట వినిపించింది.
ఇక మూడో వేవ్ విషయానికి వస్తే.. ఇప్పుడు టెస్టులకు వెళ్తున్నదే చాలా పరిమిత సంఖ్యలో అనే పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా తమకు సోకింది కరోనానే అనిపించినా, చాలా మంది టెస్టులు చేయించుకోవడం లేదు. కరోనాకు వీరు సొంత వైద్యాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఎలాగూ నూటికి 99 శాతం మంది వారం, పది రోజుల్లో రికవరీ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి.. టెస్టులతో నిమిత్తం లేకుండా సొంత వైద్యాన్నే నమ్ముకుంటున్నారు ప్రజలు.
కరోనా సింప్టమ్స్ తమలో కనిపించినా చాలా మంది టెస్టుల జోలికి వెళ్లడం లేదు. ఇదే సమయంలో ప్రస్తుతం నడుస్తున్నది శీతాకాలం. ఈ సమయంలో సాధారణంగానే జలుబూ, దగ్గులు చాలా ఎక్కువ.ఇలాంటి నేపథ్యంలో.. ఏది కరోనా, ఏది కాదనేది చెప్పడం పరీక్షలతోనే సాధ్యం…ఎన్నో కోట్ల మంది టెస్టుల జోలికి వెళ్లకపోవడంతో.. కూడా కేసుల సంఖ్య తక్కువ స్థాయిలో నమోదవుతూ ఉండవచ్చు.