కరోనా మహమ్మారికి టాలీవుడ్ రచయిత, దర్శకుడైన ఎన్.సాయి బాలాజీ ప్రసాద్ బలి అయ్యారు. తిరుపతి వాసైన ఆయన ఎన్.వరప్రసాద్గా గుర్తింపు పొందారు.
ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు.
రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసి మెళకువలు నేర్చుకున్నారు. రియల్ స్టార్ శ్రీహరితో 'శివాజీ' , 'ఒరేయ్ తమ్ముడు', ఉదయకిరణ్ తో 'జై శ్రీరామ్' సినిమాలు డైరెక్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'బావగారు బాగున్నారా' సినిమాకు స్క్రీన్ ప్లే రచయిత.
సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ కూడా చేశారు. సిరి, అపరంజి, హాలాహలం సీరియల్స్ కు వరప్రసాద్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే , ప్రపంచ సినిమాఫై మంచి పట్టు ఉన్న దర్శకుడిగా ఆయనకు గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఉజ్వల భవిష్యత్ ఉన్న వరప్రసాద్ను కరోనా రక్కసి కబళించడంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.