టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ప్రమోషన్ లభించింది. కానీ లోకేశ్ తండ్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి మాత్రం డిమోషన్ వచ్చింది. లోకేశ్ పనితీరు మెచ్చి, రామోజీరావుకు ముద్దొచ్చి తన పత్రిక ఈనాడులో లోకేశ్కు అగ్రస్థానం కల్పించారు. అయితే ఈనాడు తనకు డిమోషన్ ఇచ్చినప్పటికీ…కుమారుడికి ప్రమోషన్ కల్పించడంతో చంద్రబాబులో పుత్రోత్సాహం తొణికిసలాడుతోంది.
బాబు దయతలస్తే తప్ప ఈనాడు పాఠకులకు తెల్లారగానే ఫస్ట్ పేజీలో ఆయన మొహం చూసే భాగ్యం దక్కదు. బాబు ట్వీటాడినా, నోరు తెరిచినా ఈనాడు మొదటి పేజీలో ముద్రించి పరవశిస్తుంది. బాబు వార్త కోసం ఈనాడు ప్రతిరోజూ కలవరిస్తుంది, పలవరిస్తుంది. కానీ ఈ రోజు మాత్రం తన మొదటి పేజీలో చిన్నబ్బాయి వార్తకు ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించింది. బాబును మాత్రం లోపలి పేజీకి పరిమితం చేసింది.
“నవ మోసాలు, నవస్కామ్లు” శీర్షిక పేరుతో ఈనాడు టాప్ ప్రయారిటీగా లోకేశ్ వార్తను ప్రచురించింది. వైసీపీ ఏడాది పాలనపై విధ్వంసానికి ఒక్క చాన్స్ అంటూ టీడీపీ చార్జ్షీట్ను పార్టీ కార్యాలయంలో సోమవారం లోకేశ్ ఆవిష్కరించారు. “ఇంత ప్రజావ్యతిరేక పాలనా?” శీర్షికతో చంద్రబాబు ట్వీట్కు లోపలి పేజీలో స్థానం కల్పించారు.
ఘోర పరాజయం పాలైన చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోకపోగా…తనను ఓడించడం జనాల తప్పే అన్నట్టు వ్యవహరిస్తు న్నారు. 24 గంటలూ మీడియాలో కనిపిస్తూ ప్రజాసమస్యలపై తానేదో పోరాటం చేస్తున్నానే భ్రమలో బాబు జీవిస్తు న్నాడనే విమర్శలు లేకపోలేదు.
“ఏడాదిలోనే దోచేశారు” శీర్షికతో ఈ నెల 8న సోమవారం ఈనాడు ఫస్ట్ పేజీలో చంద్రబాబు వార్త. సీఎం అయిన వెంటనే ఇసుక రీచ్లన్నిటిని వైసీపీ మాఫియా పరం చేసి 12 నెలల్లోనే 13 లక్షల టన్నుల మాయం చేశారని ట్విటర్లో చంద్రబాబు విమర్శకు ప్రాధాన్యం. ఆ ముందు రోజు పేపర్ చూద్దాం. “పాలనలో ముద్ర అంటే స్టిక్కర్లేయడమే” శీర్షికతో చంద్రబాబు ఎద్దేవా అంటూ వార్త.
ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుని శంకరగిరి మాన్యాలు పట్టిన ఏపీ ప్రతిపక్ష నేతను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్న ఈనాడు కూడా చంద్రబాబు బాటలోనే ప్రయాణిస్తోంది. ఎందుకంటే ప్రజల మన్ననలు పొందని నేతకు అగ్రస్థానం కల్పించడం, అభిమానాన్ని చూరగొన్న నేతను ఉద్దేశ పూర్వకంగా విస్మరించడాన్ని జనం జాగ్రత్తగా గమనిస్తున్నారు. అందుకే ఆ పత్రిక రోజురోజుకూ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. సమీప భవిష్యత్లో లోకేశ్ను జనంపై రుద్దుతుందనేందుకు నేటి వార్తే నిదర్శనం.
-సొదుం