సీఎం జగన్ పాలనలో ఎన్ని లోపాలైనా ఉండొచ్చు…ఇదే సమయంలో జనానికి ఎంతో మేలు చేసే ఆలోచనలు లేకపోలేదు. ఇందుకు నిదర్శనం సీఎం జగన్ సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూలో భూసర్వేపై సమీక్షా సమావేశం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమగ్ర భూసర్వే మొదలు పెట్టి, మూడు విడతల్లో సర్వే చేయాలని సీఎం ఆదేశించడం జనానికి గొప్ప మేలు చేసే కార్యక్రమంగా చెప్పొచ్చు.
ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని, మండలాల వారీగా సర్వే చేయాలని, సర్వే హద్దు రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిజానికి ఇది గ్రామీణులకు, రాజకీయంగా, సామాజికంగా పలుకుబడి లేని వాళ్లకు ఎంతో ఉపయోగం. ఎందుకంటే కొందరు ముఠాగా ఏర్పడి సామాన్యుల భూములను భయపెట్టో, దౌర్జన్యం చేసో లాక్కోవాలని ప్రయత్నించిన, అలాగే లాక్కున్న వాళ్లకు జగన్ సర్కార్ చర్య పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. సమగ్ర భూ సర్వేతో అసలు భూయజమానులెవరు? కాని వారెవరో ప్రభుత్వమే తేల్చి చెబుతుంది.
గ్రామ సచివాలయాల పరిధిలో సర్వే చేయడంతో పాటు, ఈ సర్వే సందర్భంగా ఏమైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ అత్యంత వేగంగా కసరత్తు చేయడం గొప్ప పనిగా అభివర్ణించవచ్చు. డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మొబైల్ కోర్టులు నడుస్తాయని, దీంతో రికార్డుల ప్రక్షాళన అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు.
సర్వే వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్ పద్ధతిలో భద్రపరచడంతో పాటు ఈ డిజిటల్ సమాచారాన్ని పూర్తిగా ఎన్క్రిప్ట్ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ డేటాను ఎవ్వరూకూడా తారుమారు చేయలేని విధంగా ఒకే చోట కాకుండా మూడు నాలుగు చోట్ల భద్రపరుస్తామని సీఎంకు అధికారులు వివరించారు. జగన్ సర్కార్ చేపట్టే భూసమగ్ర సర్వే అతి పెద్ద సంస్కరణగా రాజకీయ, రెవెన్యూ సంబంధిత నిపుణులు చెబుతున్నారు. దశాబ్దాల తరబడి భూసమస్యలతో అల్లాడుతున్న సామాన్య ప్రజానీకానికి జగన్ చేపట్టే ఈ కార్యక్రమం ఒక వరంగా చెప్పొచ్చు.
రెండేళ్లు కాదు బాలయ్యా.. తర్వాత ఐదేళ్లూ ఆ పైన ఐదేళ్లూ జగనే సీఎం