తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అడ్వొకేట్ జనరల్ గా వ్యవహరించిన దమ్మాలపాటి శ్రీనివాస్ హై కోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా, తనపై ఎలాంటి చర్యలూ చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.
అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణను కోరుతూ ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంపై దమ్మాలపాటి ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఆ కుంభకోణంలో తనపై ఏ కేసులు నమోదయ్యాయో తనకు తెలియదని, తనను అరెస్టు చేయకుండా, తనపై కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని దమ్మాలపాటి హైకోర్టును కోరారట!
అడ్వొకేట్ జనరల్ హోదాను అడ్డం పెట్టుకుని అమరావతి భూ కుంభకోణంలో పాలుపంచుకోవడం గురించి తనపై చర్యలు ఉంటాయని దమ్మాలపాటి అనుమానిస్తున్నట్టుగా ఉన్నారు. ఈ విషయంలో తన అరెస్టు జరగకూడదంటూ ఆయన పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.
జగన్ ప్రభుత్వం వచ్చాకా ఈయన ఏజీ హోదాను కోల్పోయారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ లాయర్ గా మాత్రం కొనసాగుతూ ఉన్నారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే పిటిషన్లలో దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈయన అమరావతి అక్రమాల విషయంలో కోర్టుకు ఎక్కడం గమనార్హం. తనపై ఏదైనా విచారణ జరిగినా అది పూర్తిగా హై కోర్టు పర్యవేక్షణలోనే జరగాలని దమ్మాలపాటి హైకోర్టునే కోరడం గమనార్హం!