ఇప్పటి వరకూ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ నిర్ణయాలకు, ఆయన అమలు చేయాలనుకున్న అంశాలకూ ఎలాంటి ఎదురుబదురూ లేక పోయింది. నోట్ల రద్దుతో సహా ఆయన చేయాలనుకున్నవీ చేశారు. ఆ సంచలన నిర్ణయాల గురించి ఎవరితోనూ మోడీ సంప్రదింపులు చేసిన దాఖలాలు లేవు.
కొన్ని నిర్ణయాలను కనీసం పార్లమెంట్ కు తెలపాల్సిన అవసరం కూడా లేకపోయింది. రాత్రికి రాత్రి నోట్ల రద్దు చేశారు. దాని పర్యవసనాలు ఎలాంటి ఉంటాయో ఊహించలేకపోయారనేది మాత్రం స్పష్టం. ఉగ్రవాదుల కట్టడికి, నల్ల ధనికుల ఆట కట్టడికి నోట్ల రద్దు అని సెలవిచ్చారు కానీ.. ఆ రెండూ తప్ప మరెన్నో జరిగాయి నోట్ల రద్దు వల్ల.
అయితే వరసగా ఎన్నికల్లో విజయాలు సాధిస్తుండే సరికి, 2019 ఎన్నికల్లో మరింత మెజారిటీ పొందే సరికి తాము ఏం చేసినా ప్రజలు భరిస్తున్నారనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఉన్నారు కమలనాథులు. ఏ అంశంలోనూ ఎవరినీ సంప్రదించకపోవడం కేంద్రం ప్రభుత్వ విధానంగా మారింది.
పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తిరుగులేదిప్పుడు. దీంతో.. అనేక చట్టాలు చేసేస్తూ ఉన్నాయి. వీటిల్లో ప్రజలపై భారం మోపేవీ, ప్రజలు హర్షించనివి కూడా ఉన్నాయనేది స్పష్టమవుతున్న విషయం. పెట్రోల్ ధరల విషయంలో అలాంటి బిల్లునే పాస్ చేసుకున్నారు.
ఇక వ్యవసాయ చట్టాల విషయంలోనూ మోడీ ప్రభుత్వం అనుకున్నది చేయగలిగింది. అయితే.. తాము చేసిన చట్టాలకు తిరుగులేదన్న లెక్కలతో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని రైతులు గట్టిగా తగులుకున్నారు. రెండు రాష్ట్రాల రైతులే అయినప్పటికీ వాళ్లు వెనక్కు తగ్గడం లేదు.
రైతుల ఆందోళనలు అత్యంత కష్టనష్టాల మధ్యన జరుగుతున్నాయి. తీవ్రమైన చలికి తట్టుకుంటూ రైతులు రోజుల తరబడి తమ ఆందోళనలను కొనసాగిస్తూ ఉన్నారు. రైతు సంఘాలను చర్చలకంటూ పిలిచిన మోడీ ప్రభుత్వం వారిని సముదాయించలేకపోతోంది, వారికి సమాధానాలు ఇవ్వలేకపోతోంది.
ఇప్పటి వరకూ ఐదు దఫాలుగా రైతు సంఘాల ప్రతినిధులకూ, కేంద్ర ప్రభుత్వ పెద్దలకూ మధ్యన చర్చలు జరిగాయి. అయితే.. అవి ఫలప్రదం కాలేదు. వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాల్సిందే అని రైతులు స్పష్టం చేస్తున్నారు. అయితే సవరణలు అంటూ వాదిస్తోంది మోడీ ప్రభుత్వం. ఏ సవరణలూ అక్కర్లేదని, ఆ చట్టాలను వెనక్కు తీసుకోవాలని రైతు సంఘాలు బేషరతుగా చెబుతున్నాయి.
అయితే రైతులను మోడీ ప్రభుత్వం ఏ రకంగానూ సమాధాన పరచలేకపోతోంది. ఈ ప్రక్రియలోనే మోడీ ఢిల్లీలోని ఒక గురుద్వారాను కూడా సందర్శించారు. ఆందోళన చేస్తున్నది సిఖ్ రైతులు కాబట్టి.. గురుద్వారాను సందర్శిస్తే సరిపోతుందనేది మోడీ వ్యూహం కాబోలు. అయితే ఈ తరహా రాజకీయ విన్యాసాలు సమస్యలను పరిష్కరిస్తాయా? అనేది శేషప్రశ్న.
ఏదేమైనా… రైతులను సమాధాన పరచడంలో మోడీ ప్రభుత్వం ఫెయిల్యూర్ స్పష్టంగా అగుపిస్తుంది. ఇన్నాళ్లూ తాము తీసుకున్న నిర్ణయాలపై ఎవరూ ఎదురుచెప్పలేదు, ఏవైనా నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం అయితే.. దేశభక్తో, జాతీయ వాదమనో, ఉగ్రవాద వ్యతిరేకమనో.. వాదిస్తూ.. మోడీ ప్రభుత్వం పాలిస్తూ వచ్చింది.
తొలిసారి తీవ్రమైన నిరసనలు ఎదురవుతుండటం.. తాము తిరుగులేని మెజారిటీతో ఉన్నామనే లెక్కలతో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదే కావొచ్చు. మరి అంతిమంగా రైతుల కోరిక మేరకు మోడీ ప్రభుత్వం వెనక్కు తగ్గిదే కేంద్రానికి వచ్చే నష్టం ఏమీ లేదు. తాము చేసిన చట్టాల విషయంలో ఇగోకు తీసుకోకుండా.. మోడీ ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలబడితే అది అభినందనీయ చర్యే అవుతుంది.
మరోవైపు మోడీ చెబుతున్న విషయాలతో విబేధిస్తున్న రైతులు, రైతు సంఘాలు కొత్త తరహా నిరసనలు షురూ చేశాయి. మోడీ గతంలో చెప్పిన ప్లేట్లు, గ్లాసులు, డప్పు కొట్టడాలు.. వంటి కార్యక్రమాల ద్వారా ఇప్పుడు నిరసనల మోత మోగుతోంది. జనతా కర్ఫ్యూ సమయంలో మోడీ తప్పట్లు, తాళాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రైతులు కూడా వాటినే అందుకుని నిరసనలు తెలుపుతున్నారు.