Advertisement

Advertisement


Home > Politics - Gossip

బీజేపీ బాటలో మరిన్ని పాత సామాన్లు!

బీజేపీ బాటలో మరిన్ని పాత సామాన్లు!

మొన్నటివరకూ చంద్రబాబు నాయుడు ఈ పాత సామాన్లను కొన్నారు. వాటితో పెద్దగా ఉపయోగం ఏమీ ఆయనకు కూడా కలగలేదు. కొంతలో కొంత మాత్రం వారు ఉపయోగపడ్డారు. అయితే అతి తెలుగుదేశం పార్టీకి టైమ్‌ కలిసి వచ్చినప్పుడు ఆ పాత సామాన్లు కూడా మెరిశాయి. అయితే తెలుగుదేశం పార్టీని జనాలు చిత్తు చేయాలని నిర్ణయించాకా.. ఆ పాత సామాన్లు తుక్కు అయ్యాయి. అలాంటి తుక్కును ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే టీజీ వెంకటేష్‌ భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయారు. ఇక ఆ ప్రయత్నంలో జేసీ దివాకర్‌రెడ్డి, కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి లాంటివారు కూడా ఉన్నారట. వీరిలో జేసీ దివాకర్‌రెడ్డి ఇప్పటికే చాలా సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. తనకు రాజ్యసభ సభ్యత్వాన్నే కోరారట జేసీ. అయితే ఉన్నట్టుండి చేరిపోగానే రాజ్యసభ సీటును ఖరారు చేసేందుక అదేం తెలుగుదేశం పార్టీ కాదు కదా. కాబట్టి ఆ చేరిక కొంత ఆగిందని సమాచారం.

అయితే అధికారంలో ఉన్న పార్టీని అంటిపెట్టుకోలేకపోతే జేసీ వ్యాపారాలు, వ్యవహారాలు ముందుకు సాగడం ఇబ్బందే అని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తనయుల కోసం అయినా దివాకర్‌ రెడ్డి బీజేపీలోకి చేరడం ఖాయమనే మాట వినిపిస్తూ ఉంది. అయితే ఇలా వరసపెట్టి పార్టీలు మారితే జనాలు కూడా అసహ్యించుకుంటారు. జనాలు మళ్లీ ఆదరించే అవకాశాలు కూడా ఉండవు. అయినా ఇప్పుడు వాళ్లకు కావాల్సింది జనాలు ఆదరించడం కాదు, కొన్నాళ్ల రాజకీయ ఆశ్రయం. అది బీజేపీ ద్వారా దక్కుతుందని అనుకుంటున్నట్టుగా ఉన్నారు.

ఇక కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఈయన శుద్ధంగా కాంగ్రెస్‌ పార్టీలో ఉండేవారు. తమ కుటుంబం గొప్పదన్నట్టుగా కాంగ్రెస్‌కే పరిమితం అన్నట్టుగా వ్యవహరించారు. అలా వ్యవహరించి ఉంటే గౌరవం అయినా మిగిలేది. అయితే ఈయనను తెలుగుదేశం పార్టీ వాళ్లు ఒత్తిడి చేసి మరీ చేర్చుకున్నారు.  ఎన్నికల్లో ఖర్చులు సైతం తామే పెట్టుకుంటామంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు కోట్లను చేర్చుకున్నారని అప్పుడే వార్తలు వచ్చాయి.

కర్నూలు ఎంపీగా కోట్లను పోటీచేయించి మొత్తం ఖర్చులన్నింటినీ చంద్రబాబు నాయుడే పెట్టుకున్నారట. తీరా ఫలితాలు వచ్చాకా ఖర్చులు లాసే తప్ప అంతకు మించి ప్రయోజనం లేదని తేలింది.తెలుగుదేశం పార్టీలోకి చేరి కూడా గెలవలేకపోయిన కోట్ల అన్ని రకాలుగానూ పరువు పోగొట్టుకున్నారు. అటు పార్టీ మారిన కళంకం అంటింది. ఇటు ఎంపీగా ఓడిపోవడమూ జరిగింది. ఇక తదుపరి ఈయన బీజేపీలోకి చేరితే బ్యాలెన్స్‌ పరువు కూడా ఊడ్చుకుపోతుంది. అందుకే ఈయన ఇప్పుడు కమలం పార్టీలో చేరడం విషయంలో తర్జనభర్జనలు పడుతున్నారట.

అయితే ఈయన అనుచరగణం మాత్రం బీజేపీ తమకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తోందని అంటున్నారట. ఆయనకు కేంద్రమంత్రి పదవి కూడా ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటు ఫలితాన్ని గమనించి కూడా బీజేపీ కోట్లకు అలాంటి బంపర్‌ ఆఫర్‌ ఇస్తే.. అదో వింత రాజకీయమే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.

పవన్ ఓటమికి మరెవరూ కారణం కాదు.. పవన్ కల్యాణే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?