Advertisement

Advertisement


Home > Politics - Gossip

‘మధ్య’పతనం : స్వయంకృతం కాక మరేమిటి?

‘మధ్య’పతనం : స్వయంకృతం కాక మరేమిటి?

మధ్యప్రదేశ్ లో, ఎన్నికల నాటికి సుస్థిరంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో తలపడి, ఓడించి.. ఎన్నికల పోరాటాన్ని మొత్తం ఒంటరిగా తన భుజస్కంధాలపై మోయడం అనేది మామూలు సంగతి కాదు. కానీ.. ఆ బాధ్యతను జ్యోతిరాదిత్య సింధియా స్వీకరించారు. పార్టీని గెలిపించడానికి విపరీతంగా పరిశ్రమించారు. కాంగ్రెస్ పార్టీ యువనాయకత్వాన్ని ప్రోత్సహించడానికి చూస్తున్నదని ఆ క్రమంలో.. పార్టీ గెలిస్తే సింధియాకు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని కూడా అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!

ఎన్నికలు ముగిసి.. బొటాబొటీ మెజారిటీతోనే అయినా అధికారం దక్కే వాతావరణం కనపడగానే.. కాంగ్రెస్ అధిష్టానం బుద్ధి మారిపోయింది. సీనియారిటీ అనే ముసుగులో ముఖ్యమంత్రి పీఠంపైకి కమల్ నాధ్ ను తీసుకు వచ్చారు. ఇది జ్యోతిరాదిత్యకు పెద్ద అశనిపాతం. కానీ ఆయన నిమ్మళంగా ఉండిపోయారు.

నిజానికి ఆ నాటినుంచి కూడా... జ్యోతిరాదిత్య కాంగ్రెసును వీడి, భాజపాలో చేరుతారనే పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే వారి కుటుంబానికి కాంగ్రెస్ తో ఉన్న అనుబంధం, రాహుల్ యువ టీమ్ లో సింధియాకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఇది నిజమవుతుందని ఎవరూ అనుకోలేదు. కాంగ్రెస్ దానిని అసలు ఏమాత్రం సీరియస్ గా పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే.. ఆయనలో రగులుతున్న అసంతృప్తిని చక్కబెట్టే ప్రయత్నాలు ఏ కొంచెమైన జరిగి ఉంటే గనుక.. ఇవాళ ఈ దుస్థితి వారికి సంప్రాప్తించేదే కాదు.

అసలే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఇక ఆ పార్టీ ఎన్నాళ్లు బతికి ఉంటుందో.. ఏమాత్రం జవసత్వాలతో ఉంటుందో కూడా అర్థం కాని అగమ్యగోచరమైన స్థితిలో పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో.. పదిలమైన, సుస్థిరమైన రాజకీయ భవిష్యత్తును కోరుకునే ఏ నాయకుడైనా ఆ పార్టీలో కొనసాగడానికి ఇష్టపడరు. ఇతరత్రా గతిలేని, భవిష్యత్తు ఆశలేని ముసలి సరుకు మాత్రమే మిగిలే పార్టీగా కాంగ్రెస్ తయారైందని ఇవాళ ప్రజలు అనుకుంటున్నారంటే.. అందులో అతిశయోక్తి లేదు.

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?

మాట, గౌరవం రెండూ నిలబెట్టుకున్న జగన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?