Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ తో 'నాట్ హ్యపీ'

జగన్ తో 'నాట్ హ్యపీ'

ఓ మనిషి నిర్ణయాలు ప్రతి ఒక్కరనీ సంతోష పెట్టలేవు. సంతృప్తిని కలిగించలేవు. అయితే ఎక్కడ తేడా జరుగుతోంది అని తెలుసుకుని, అవకాశం వుంటే సరిదిద్దుకుని, సంతృప్తిగా లేని వారిని కూడా మార్చాల్సిన అవసరం అధికారంలో వున్నవారికి వుంటుంది. లేదూ అకారణ ద్వేషం అది అని స్పష్టమైతే విడిచిపెట్టకనూ తప్పదు.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక, పలు కార్యక్రమాలు చేపట్టారు. అధికారంలోకి రావడానికి చాలా వర్గాలు చాలా చాలా సహకరించాయి. జగన్ అధికారంలోకి వచ్చాక అలాంటి వర్గాల్లో కొన్ని అయినా అసంతృప్తికి లోనవుతున్నాయి. ఎందుకు? అలాగే కొన్ని విషయాల్లో జగన్ సరైన పరిష్కారాలు చూపలేకపోతున్నారు.

అన్నింటికన్నా కీలకమైనది ఇసుక పాలసీ. ఇసుక వ్యాపారం అన్నది ఆంధ్రలో పెద్ద మాఫియా మాదిరిగా తయారైంది. వదిలేస్తే ఒక బాధ, పట్టుకుంటే ఇంకోరకం బాధ. గత రెండేళ్లుగా జగన్ ఇసుక విషయంలో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఒక్కటీ సక్సెస్ కావడంలో లేదు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక అన్నది భారమైన వ్యవహారంగా తయారైంది. దారుణం ఏమిటంటే ఇంటి పక్కనే నది వున్నా, ఇసుక తీసుకోలేని పరిస్థితి. పలు ఆంక్షలు. ఫ్రీ ఇసుక అన్నారు అదేమైందో తెలియదు. 

ఇక మద్యం పాలసీ. ప్రభుత్వం మద్యం విక్రయాలను తన చేతుల్లోకి తీసుకోవడం వరకు ఓకె. కానీ దాని ద్వారా మద్యం వినియోగం తగ్గించాల్సి వుంది.ఎందుకు తగ్గించాలి. జగన్ తన ఎన్నికల వాగ్దానాల్లో దశల వారీ మద్యపాన నిషేధం గురించి పదే పదే ప్రస్తావించారు కనుక. కానీ జగన్ చర్యలు మద్యం వినియోగాన్ని పెంచే విధంగా వున్నాయి తప్ప తగ్గించే విధంగా కాదు. కరోనా టైమ్ లో దాని సాకు పెట్టి మద్యం నుంచి జనాలను దూరం చేయవచ్చు. కానీ జగన్ ఆ దిశగా ఆలోచించడం లేదు. 

జగన్ పట్ల జర్నలిస్ట్ లు ఎక్కువ అసంతృప్తిగా వున్నారు. ఎందుకు? జర్నలిస్ట్ లు అక్రిడేషన్ల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సమగ్రమైన విధానం రూపొందించలేక పోతున్నారు. అక్రిడేషన్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి అయ్యే ఖర్చు పెద్ద ఏమీ కాదు. కానీ ఎందుకు ఈ విషయంలో జగన్ అలా వున్నారో, ఆయన ను ఎవరు తప్పు దారి పట్టిస్తున్నారో అన్నది తెలియదు.

బ్రాహ్మణ మేధావి వర్గం ఒకప్పుడు జగన్ కు బాసటగా నిలిచింది. కానీ ఇప్పుడు అదే వర్గం దూరమైంది. ఎందుకు దూరమైంది? ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉదంతం కారణం కావచ్చు. ఎంవి కృష్ణారావు భాజపాలో వుండడం వల్ల కావచ్చు. ఉండవల్లి కి మరో విధమైన అసంతృప్తి వుండొచ్చు. వీటిని కనిపెట్టి చక్కదిద్దడం పెద్ద కష్టం కాదు. కానీ అస్సలు ఆ దిశగా జగన్ ఆలోచించడం లేదు.

ఉద్యోగస్థులు జగన్ కు 2014లో అండగా లేరు. 2019లో ఆయనతో వున్నారు. కానీ ఇప్పుడు వ్యవహారం నివురు గప్పిన నిప్పులా వుంది. వారి సమస్యలు, ఇతరత్రా వ్యవహారాలు అలాగే వున్నాయి. వీటి మీద జగన్ దృష్టి పెట్టాల్సి వుంటుంది. 

క్షత్రియులు 2014లో జగన్ కు దూరంగా వున్నారు. 2019 లో దగ్గరయ్యారు. కానీ రఘురామ రాజు వ్యవహారంతో మళ్లీ దూరం అయ్యేలా వున్నారు. అయితే ఇది జగన్ తప్పు కాదు. రఘురామరాజు తప్పే అని క్లారిటీగా తెలుస్తోంది. కానీ ఈ రోజుల్లో కులాభిమానాలు ఎలా వున్నాయి అంటే తమవాడిది తప్పయినా సరే, తమవాడితోనే వుంటాం అనే విదంగా సాగుతున్నాయి. అందువల్ల ఈ విషయంపై జగన్ దృష్టి పెట్టి, సమస్య జటిలం కాకుండా క్షత్రియ వర్గాన్ని సముదాయించగలగాలి.

అర్బన్ ఓటర్లు వేరు, మిడిల్ క్లాస్ ఓటర్లు వేరు. వైట్ కార్డ్ ఓటర్లు వేరు. వీరిలో వైట్ కార్డ్ ఓటర్లు జగన్ తో ఫుల్ హ్యాపీ. కానీ వాళ్లకు జగన్ ఇస్తున్న డబ్బులు ఇచ్చేది అర్బన్ ఓటర్లు, మిడిల్ క్లాస్ ఓటర్లు. వాళ్లు కట్టే పన్నులే కదా ప్రభుత్వానికి ఆసరా. కానీ వాళ్ల కోసం జగన్ ఏమీ చేస్తున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా వైట్ కార్డ్ హోల్డర్లకు జగన్ ఎడా పెడా పంచుతున్నది చూస్తుంటే మిడిల్ క్లాస్ జనాలకు ఎంత మండాలో అంతా మండుతోందన్నది వాస్తవం. 

డబ్బున్నవాడికి సమస్య లేదు. వైట్ కార్డ్ హోల్డర్లకు సమస్య లేదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్లను చూసే నాధుడు లేడు. ఈ విషయంలో కూడా జగన్ ఆలోచించాల్సి వుంది. అర్బన్ ఓటర్లలో కచ్చితంగా ఓటేసే వాళ్లలో మిడిల్ క్లాస్ వాళ్లు పక్కాగా వుంటారు. వాళ్లకు కూడా మేలు చేసే పథకాల గురించి ఆలోచించాల్సి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?