వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్, మంత్రి కూడా అయిన ఆమెకు ఈ దఫా టికెట్ దక్కే అవకాశాలే లేవు. ఈ విషయాన్ని వైసీపీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆమెకు టికెట్ ఇచ్చినా సొంత పార్టీ నేతలే పనిగట్టుకుని ఓడిస్తారని సీఎం జగన్కు నివేదికలు వెళ్లాయి. దీంతో ఆమెకు టికెట్ ఇవ్వకుండా మరో రకంగా పార్టీ కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
వైసీపీకి ఇప్పుడు ప్రచార టీమ్ లేదు. గతంలో జగన్కు తోడుగా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ప్రచారం చేశారు. ఇప్పుడా ఇద్దరు లేరు. దీంతో సదరు ఫైర్ బ్రాండ్ మంత్రిని స్టార్ క్యాంపెయినర్గా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సినీ సెలబ్రిటీ కూడా కావడంతో ఎన్నికల ప్రచారంలో పార్టీకి కలిసొస్తుందని సీఎం భావన. ప్రత్యర్థులపై ఆమె పంచ్లతో విరుచుకుపడుతుంటారు.
ఆకట్టుకునే ప్రసంగం, సినీ నేపథ్యం వెరసి స్టార్ క్యాంపెయినర్గా పనికొస్తుందని వైసీపీ ఆలోచించినట్టు తెలుస్తోంది. రాయలసీమ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సదరు మహిళా మంత్రికి సొంత పార్టీలోనే శత్రువులు ఎక్కువయ్యారు. నియోజకవర్గంలో ఊపిరి పీల్చుకోలేనంతగా ఆమెకు సొంత పార్టీలోనే పెద్దాయన వ్యతిరేకులను పెంచి పోషించారనే చర్చ జరుగుతోంది.
దీంతో సదరు పెద్దాయనకు జగన్ సర్ది చెప్పలేక, ఫైర్బ్రాండ్నే ఎన్నికల పోరు నుంచి విరమింపజేయడానికి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మళ్లీ ప్రభుత్వం వస్తే... ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఇస్తామనే హామీతో టికెట్ను నిరాకరించడానికి ప్లాన్ చేశారని వైసీపీలో చర్చ నడుస్తోంది. వైసీపీలో పెద్ద ఎత్తున జగన్ ప్రక్షాళన చేపట్టిన సంగతి తెలిసిందే. గెలుపే ప్రామాణికంగా జగన్ అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. ఈ క్రమంలో సదరు ఫైర్బ్రాండ్కు గెలుపు అవకాశాలు లేవని గ్రహించి, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు