Advertisement

Advertisement


Home > Politics - Gossip

టీడీపీ టు బీజేపీ.. మళ్లీ వలసలు షురూ?

టీడీపీ టు బీజేపీ.. మళ్లీ వలసలు షురూ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆర్థిక నేరగాళ్లు, ఆ నేరాల్లో శిక్షపడినవాళ్లు, శిక్షపడే అవకాశం ఉన్నవాళ్లు.. గుంపగుత్తగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ వలసలు కాస్త నిదానించాయి. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో జరిగిన మార్పులు తిరిగి వలసల్ని ప్రోత్సహించే దిశగా ఉన్నాయి.

టీడీపీ కి చెందిన ముగ్గురు కీలక నేతలు ఆల్రెడీ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. బెయిలు కూడా తెచ్చుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి దశలో టీడీపీలో ఉండి ఏం సాధించాలి అనే వాదన మరికొందరిలో బైటపడింది. తెలుగుదేశం పార్టీలో క్రేజీ వియ్యంకులుగా పేరుపొందిన ఇద్దరు నేతలు ఇటీవల కేసుల విషయంలో బాగా భయపడుతున్నారట.

వైసీపీలో చేరే ప్రయత్నాలు చేసినా బెడిసి కొట్టడంతో ఇద్దర్లో ఒకరు ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. అయితే ఆయన వియ్యంకుడు మాత్రం కాస్త హుషారుగా కాషాయం కండువా కప్పుకునేందుకు బయలుదేరాడట. తనతోపాటు తన బావగారిని కూడా అటువైపుకే లాగే ప్రయత్నాల్లో ఉన్నారట. విద్యాసంస్థల్లో నష్టాలు చవిచూడ్డంతో పాటు, ఎన్నికల టైమ్ లో టీడీపీకి ఫండింగ్ చేసి బాగా చితికిపోయిన ఆ వియ్యంకుడు ఇప్పుడు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారట.

కన్నా లక్ష్మీనారాయణ ఉన్నంతకాలం ఏపీలో బీజేపీ పరిస్థితి ఆల్ టైమ్ దారుణంగా ఉందనే విషయం ఎంత వాస్తవమో.. దీని వెనక చంద్రబాబు ఉన్నారనే విషయం కూడా అంతే వాస్తవం. అలాంటిది ఇప్పుడు బాబు చేతిలో కీలుబొమ్మను పక్కనపెట్టి పార్టీలోనే పుట్టి పెరిగిన వీర్రాజుకి పగ్గాలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. దీంతో మళ్లీ వలసలపై ఆయన ప్రత్యేక దృష్టిపెట్టారట. ఇటు టీడీపీ జనాలు కూడా కన్నా మారి వీర్రాజు రావడంతో మరోసారి బీజేపీపై ఆశలుపెట్టుకున్నారు. 

టీడీపీ నేతలు కూడా రకరకాల భయాలతో హడలిపోతున్నారు. కనీసం తమ తరపున టీడీపీ పోరాటం చేస్తుందన్న నమ్మకం కూడా లేదు. అచ్చెన్నాయుడి విషయంలో ఎంతసేపు లోకేష్ ని తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారే కానీ, అచ్చెన్న తప్పుచేయలేదని టీడీపీ అధిష్టానం ఎక్కడా చెప్పుకోవడంలేదు. ముడుపులు చంద్రబాబు కుటుంబానికి, కేసులు మాత్రం మాకా అని తీవ్ర ఆవేదనలో ఉన్నారు కింజరపు కుటుంబ సభ్యులు.

జేసీ బ్రదర్స్ విషయంలో కూడా ఇలాగే చేతులు దులుపుకున్నారు చంద్రబాబు. పైకి లోకేష్ పరామర్శకు వెళ్లినా.. ఆ తర్వాత కనీసం బెయిలు విషయంలో కూడా ఆ కుటుంబాన్ని ఆరా తీయలేదట. అదీ చంద్రబాబు లెక్క. ఇదే ఆందోళన, ఆవేదన చాలామంది నాయకుల్లో ఉంది కానీ ఎవరూ బైటపడటంలేదు.

అవకాశం ఉన్నంత వరకు ఇలాంటి వారికి గాలం వేయాలని కొత్త బీజేపీ అధ్యక్షుడు ఉవ్విళ్లూరుతున్నారు. పరిపాలనా రాజధానిగా మారబోతున్న విశాఖ జిల్లాలోనైనా పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. దీని కోసం వియ్యంకుల్లో ఒకర్ని వాడుకోవాలనేది బీజేపీ ఎత్తుగట.

కమలం ప్లాన్ వర్కవుట్ అయితే ఏపీలో టీడీపీ ఖాళీ అవడం మరింత త్వరగా జరుగుతుందన్న మాట. ఒకరు ధైర్యం చేస్తే.. మిగతావాళ్లు క్యూ కట్టడానికి ఏమాత్రం ఆలస్యం చేయరు.

రామ్ గోపాల్ వర్మని మించిన సక్సెస్ ఫుల్ పర్సన్ ఎవరూ లేరు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?