వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికలో భారీ ప్రక్షాళన చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిధిలో కీలక మార్పులు చేపట్టనున్నట్టు సమాచారం. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మికి ఎమ్మెల్యే సీటు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ నుంచి ఆమెను పోటీ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం అక్కడి నుంచి వైసీపీ తరపున వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిత్యం వహిస్తున్నారు. ఈయనపై నియోజకవర్గంలో వ్యతిరేకతను దృష్టిని పెట్టుకుని కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ మేయర్, బీసీ సామాజిక వర్గానికి చెందిన భాగ్యలక్ష్మిని బరిలో దింపాలని జగన్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
విజయవాడను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దారన్న మంచి పేరును భాగ్యలక్ష్మి సంపాదించుకున్నారు. అలాగే భాగ్యలక్ష్మి భర్త నరేంద్రకుమార్ వ్యాపార రీత్యా విజయవాడ వెస్ట్లో మంచి సంబంధాలు కలిగి వున్నారు. వ్యాపార వర్గాల్లో మంచి పట్టు వుండడంతో పాటు సామాన్య ప్రజానీకంలో వైసీపీ ప్రభుత్వంపై సానుకూలత కలిసి వస్తాయని సీఎం ఆలోచనగా చెబుతున్నారు.
దీంతో మాజీ మంత్రి వెల్లంపల్లికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చూసి, భాగ్యలక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్ వ్యూహం రచిస్తున్నారు. త్వరలో విజయవాడ వెస్ట్ టికెట్ను మేయర్కు ప్రకటించే అవకాశాలున్నాయి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు