కొంత మంది గొప్పవాళ్ల గురించి నేటి తరం నాయకులు మాట్లాడ్డం వింటుంటే ….మన ఖర్మరా నాయనా అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం లేకపోలేదు. మాట్లాడుతున్న సదరు వ్యక్తుల ఆచరణ అందుకు భిన్నంగా ఉండడమే. అందుకే ఏదైతే మాట్లాడుతున్నామో, అదే ఆచరిస్తే సమాజంలో గౌరవం దక్కుతుందని పెద్దలు చెబుతారు. మాటలకు, చేతలకు పొంతన లేకపోతే అభాసుపాలు అవుతారు. ఇది ఏ స్థాయి వ్యక్తులకైనా వర్తిస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దేవాలయాలపై దాడుల గొడవ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు రాజకీయంగా రాజకీయ పబ్బం గడుపుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుండడం కళ్లెదుట ప్రత్యక్షంగా కనిపిస్తోంది.
కాదేది రాజకీయానికి అతీతమని నాయకులు నిరూపిస్తున్నారు. ఇదిలా ఉండగా జనసేనాని పవన్కల్యాణ్ తనదైన స్టైల్లో సూక్తులు చెప్పుకొచ్చారు. బీజేపీతో మైత్రి తర్వాత పవన్కల్యాణ్ ఒక్కసారిగా హిందుత్వ జనోద్ధారకుడిగా అవతరించిన విషయం తెలిసిందే.
‘మూర్తీభవించిన ధర్మం శ్రీరామచంద్రుడు అంటూ మారీచుడు అనే రాక్షసుడు రావణాసురుడితో చెప్పాడు. త్రేతాయుగంలో ఒక రాక్షసుడు శ్రీరాముని గుణగణాలను ఉన్నతంగా చెబితే… రాక్షస వారసులెవరో వర్తమానంలో ధర్మ విచ్ఛిన్నానికి ఒడిగట్టారు. ధర్మం విచ్ఛిన్నానికే శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు’ అని పవన్కల్యాణ్ పేర్కొన్నారు.
పవన్ చెబుతున్నట్టు మూర్తీభవించిన ధర్మం శ్రీరామచంద్రుడు. రాముడికి సకల గుణాభిరాముడనే పేరు ఉంది. అన్నిటికి మించి శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడు. సీతాదేవిని తప్ప పరస్త్రీని కన్నెత్తి చూడని యుగ పురుషుడు. అలాగే ఆయన పితృవాక్య పరిపాలకుడు.
తన తండ్రి దశరథునికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని, పాలనను విడిచిపెట్టి 14 ఏళ్ల పాటు వనవాసం చేసిన గొప్ప త్యాగమూర్తిగా శ్రీరామచంద్రుడు ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు.
ధర్మ విచ్ఛిన్నం అంటే ఏకపత్నీ వ్రతానికి విరుద్ధంగా వ్యవహరించడమని అర్థం చేసుకోవాలి. అంటే పరస్త్రీలపై వ్యామోహం పెంచుకుని ఒకరికి మించి ఎక్కువ మంది మహిళలను పెళ్లాడడం లేదా మరే విధంగానైనా అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ కారణాలు అనవసరం. మరి శ్రీరాముని గుణగుణాల గురించి కేవలం కీర్తిస్తే, ఆయన్ను గౌరవిస్తున్నట్టా? అబ్బే కానేకాదు. ఎవరైతే శ్రీరాముని జీవితం నుంచి నీతిని గ్రహించి, దాన్ని ఆచరిస్తారో వారే ఆ మాధవుడికి నిజమైన భక్తులని అర్థం చేసుకోవాలి. అలాంటి వారే శ్రీరాముని రాజ్యస్థాపనకు నిజమైన వారసులు.
వర్తమానంలో ధర్మ విచ్ఛిన్నానికి ఒడిగడుతున్న రాక్షసులెవరో జనసేనాని, లక్షలాది పుస్తకాలు చదివిన జ్ఞానసంపన్నుడైన పవన్కల్యాణ్ చెబితే బాగుంటుంది.
శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలను ధ్వంసం చేయడం కంటే, ఆయన ఆశయాలను, సద్గుణా లను విధ్వంసం చేయడం నేరమంటే పవన్కల్యాణ్ కాదంటారా? అందుకే పవన్కల్యాణ్ సూక్తులు వింటూ… ఇది ఖర్మరా నాయనా అని పొరపాటున కూడా మనసులోకి ఆలోచన రానివ్వొద్దు. ఎందుకంటే ఇప్పుడంతా రివర్స్ కాలం నడుస్తోంది. ఏం చేద్దాం, అంతా కలికాల మహిమ అని సరిపెట్టుకుందాం.